ఈటల నన్ను కలవలేదు... కలవడానికి సంప్రదించిన మాట నిజమే: కిషన్ రెడ్డి

ఇటీవల భూ ఆక్రమణల ఆరోపణలపై మంత్రి పదవి కోల్పోయిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరనున్నాడని ప్రచారం జరుగుతోంది. బీజేపీ నుంచి ఈటలకు పిలుపు వచ్చిందని కథనాలు వస్తున్నాయి. దీనిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఈటల తనను కలిసినట్టు వస్తున్న వార్తల్లో నిజంలేదని స్పష్టం చేశారు. అయితే తనను కలిసేందుకు ఈటల సంప్రదించిన విషయం వాస్తవమేనని అన్నారు. ఇద్దరం ఫోన్లో మాట్లాడుకున్నామని తెలిపారు.

తాను, ఈటల అనేక ఏళ్లపాటు అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా కొనసాగామని, ఇద్దరం కలిస్తే తప్పేంటని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఈటల వస్తే మాట్లాడేందుకు తనకేమీ అభ్యంతరం లేదన్నారు. హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న ఈటల రాజీనామాపై ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనూ కిషన్ రెడ్డి స్పందించారు. హుజూరాబాద్ కు ఉప ఎన్నిక వస్తే పోటీ చేయాలా, వద్దా? అనేది ఇంకా బీజేపీ హైకమాండ్ తో చర్చించలేదని తెలిపారు.


More Telugu News