కరోనా దెబ్బకు ఐపీఎల్ ఆగిపోయింది!

BCCI announced no IPL for this season
  • ఈ సీజన్ కు ఐపీఎల్ నిరవధిక వాయిదా
  • పలు జట్లలో కరోనా పాజిటివ్ ఆటగాళ్లు
  • నిన్న ఓ మ్యాచ్ నిలిపివేత
  • తాజాగా మరికొందరు ఆటగాళ్లకు కరోనా
  • కఠిన నిర్ణయం తీసుకున్న బీసీసీఐ
కరోనా సమయంలోనూ ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను అలరిస్తున్న ఐపీఎల్ చివరికి ఆ కరోనా కారణంగానే ఆగిపోయింది. ఐపీఎల్ జట్లలో పలువురు ఆటగాళ్లు కరోనా బారినపడుతుండడంతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సీజన్ కు ఐపీఎల్ ను నిలిపివేస్తున్నట్టు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు.

అయితే ఈ నిలిపివేత తాత్కాలికమేనని, వారం రోజుల విరామం తర్వాత ఐపీఎల్ పునఃప్రారంభం అవుతుందని క్రికెట్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు తాజా సీజన్ లో 29 మ్యాచ్ లు జరగ్గా, మిగిలిన మ్యాచ్ లన్నింటినీ ముంబయిలోనే జరపాలని ప్రతిపాదనలు వస్తున్నాయి. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

కాగా, ముంబయిలో ఐపీఎల్ పోటీల రద్దు/వాయిదా కోరుతూ దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టేందుకు బాంబే హైకోర్టు అంగీకరించింది. సెకండ్ వేవ్ కారణంగా కరోనా విజృంభణ, కరోనా కారణంగా నమోదవుతున్న మరణాలను పరిగణనలోకి తీసుకుని ఐపీఎల్ నిలిపివేతకు ఆదేశాలు ఇవ్వాలని, ఇప్పటివరకు జరిగిన నష్టానికి రూ.1000 కోట్ల పరిహారం చెల్లించేలా బీసీసీఐని ఆదేశించాలని ఆ పిటిషన్ లో కోరారు. ఐపీఎల్ లాభాల నుంచి కరోనా చికిత్సలకు, ఆక్సిజన్ కు అయ్యే మొత్తాన్ని రాబట్టాలని విజ్ఞప్తి చేశారు.

అటు, ఢిల్లీ హైకోర్టులోనూ ఇలాంటి పిటిషనే దాఖలైంది. తక్షణమే ఐపీఎల్ పోటీలను నిలిపివేసేలా ఆదేశించాలని ఆ పిటిషన్ లో విన్నవించారు. ప్రజారోగ్యం కంటే ఇలాంటి మ్యాచ్ లకే ఎందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్న దానిపై విచారణ చేపట్టాలని కోరారు.
Go Back to Shorts
IPL
BCCI
Season
Corona Pandemic
India

More Telugu News