IPL 2021: శివం మావి బౌలింగ్‌లో పృథ్వీ షా ఆరు ఫోర్లు.. మ్యాచ్ ముగిశాక మావి ప్రతీకారం!

ఐపీఎల్‌లో భాగంగా గతరాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్ జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ జట్టు ఓపెనర్ పృథ్వీషా చెలరేగి ఆడాడు. 41 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 82 పరుగులు పిండుకున్నాడు. కోల్‌కతా బౌలర్ శివమ్ మావి వేసిన ఓవర్‌లో వరుసగా ఆరు ఫోర్లు కొట్టి తన ఉద్దేశాన్ని చాటాడు. ఐపీఎల్‌లో ఒక ఓవర్‌లో ఆరు ఫోర్లు కొట్టడం ఇది రెండోసారి మాత్రమే.  గతంలో అజింక్య రహానే ఈ ఘనత సాధించాడు.

మ్యాచ్ ముగిసిన తర్వాత పృథ్వీ షా వద్దకు వచ్చిన శివమ్ మావి తన బంతులను బౌండరీలకు తరలించినందుకు ప్రతీకారం తీర్చుకున్నాడు. సరదాగా అతడి మెడను అదిమిపట్టుకున్నాడు. ఈ వీడియోను ఐపీఎల్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. ‘‘మ్యాచ్ ముగిసింది.. ఫ్రెండ్‌షిప్ మొదలైంది. ఐపీఎల్ గొప్పతనం ఇదే’’ అని క్యాప్షన్ తగిలించింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
IPL 2021
Prithvi Shaw
Shivam Mavi

More Telugu News