నేనింకా మరణించలేదు... మీకెందుకు అంత తొందర?: లోక్ సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్

Sumitra Mahajan Fires on Fake News
  • సుమిత్ర చనిపోయినట్టు వార్తలు
  • సంతాపం వెలిబుచ్చిన శశిథరూర్
  • తాను బతికే ఉన్నానని మీడియాకు చెప్పిన సుమిత్ర
  • నిజం తెలుసుకోకుండా వార్తలు ఎందుకని మండిపాటు
తాను మరణించినట్టు న్యూస్ చానెళ్లలో, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై లోక్ సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ మండిపడ్డారు. తాను కన్నుమూశానన్న విషయాన్ని కనీసం నిర్ధారించుకోకుండా ఈ వార్తలు, తొందర ఏంటని ప్రశ్నించారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆమె, వార్తలు అందించే చానెళ్లను ఇటువంటి వార్తలు ఎందుకు ప్రసారం చేస్తున్నారని ప్రశ్నించారు. తాను ఇంకా మరణించలేదని, అధికారిక సమాచారం లేకుండా, ఇటువంటి న్యూస్ వ్యాప్తి చేయాల్సిన అవసరం ఏంటని అడిగారు.

కాగా, సుమిత్రా మహాజన్ మరణించారని నిన్నటి నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు చూసి, కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ సైతం తన ట్విట్టర్ ఖాతాలో సంతాప సందేశాన్ని ఉంచారు. ఈలోగా పలు టీవీ చానెళ్లు కూడా ఆమె మరణించినట్టు వార్తలను ప్రసారం చేశాయి. అయితే, ఆమె క్షేమంగా వున్నారంటూ బీజేపీ నేతలు స్పష్టం చేయడంతో శశిథరూర్, తాను పెట్టిన ట్వీట్ ను తొలగించారు.

ఈ సంఘటనపై సుమిత్రా మహాజన్ కుమారుడు మందర్ సైతం స్పందిస్తూ, ఓ వీడియోను విడుదల చేశారు. తన తల్లిపై వస్తున్న తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని, ఆమె క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు.
Go Back to Shorts
Sumitra Mahajan
Fake News
Media
Died

More Telugu News