Maharashtra: నర్సు నిర్లక్ష్యం.. ఒకే మహిళకు ఒకే రోజు రెండు డోసుల టీకా!

  • యూపీలోని కాన్పూర్‌ జిల్లాలో ఘటన
  • ఫోన్‌లో మాట్లాడుతూ నిర్లక్ష్యం
  • నిరసన వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు
  • విచారణకు ఆదేశించిన కలెక్టర్‌
  • ప్రస్తుతానికి ఎలాంటి దుష్ప్రభావాలు లేవని కుటుంబ సభ్యుల వెల్లడి
A nurse Negligency single person given a two doses of vaccine on the same day

ప్రపంచమంతా కరోనాతో చిగురుటాకులా వణుకుతున్న తరుణంలో దాన్ని నివారించే టీకా వరప్రదాయినిలా వచ్చింది. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిందే తడువు ప్రపంచవ్యాప్తంగా సాధారణ పరిస్థితులు నెలకొంటూ వచ్చాయి. ఈ ప్రయాణంలో వైద్యులు, వైద్యారోగ్య సిబ్బంది చేసిన త్యాగాలను యావత్తు ప్రపంచం కీర్తించింది.

ఇదిలా ఉంటే.. తాజాగా యూపీకి చెందిన ఓ నర్సు చేసిన నిర్వాకం వైద్యవర్గాలకే తలవంపులు తెచ్చేలా ఉంది. శనివారం ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ జిల్లా అక్బర్‌పూర్‌ ప్రాంతానికి చెందిన కమలేశ్‌ కుమారి అనే 50 ఏళ్ల మహిళ కరోనా తొలి డోసు కోసం  స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఓ నర్సు ఫోన్‌లో మాట్లాడుతూ బిజీగా ఉన్నారు. ఓవైపు ఫోన్‌లో మాట్లాడుతూనే పరధ్యానంలో కమలేశ్‌కు రెండు సార్లు టీకా ఇచ్చారు.

దీన్ని గమనించిన కమలేశ్‌ ఆమెను ప్రశ్నించగా.. నర్సు క్షమాపణలు చెప్పాల్సింది పోయి బుకాయించే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆస్పత్రికి వద్దకు చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఈ విషయాన్ని జిల్లా కలెక్టరు, ప్రధాన వైద్యాధికారి దృష్టికి తీసుకెళ్లారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన వారు వెంటనే దర్యాప్తునకు ఆదేశించారు.

అయితే, ప్రస్తుతం కమలేశ్‌లో ఎలాంటి దుష్ప్రభావాలు లేవని కుటుంబ సభ్యులు తెలిపారు. టీకా వేసిన దగ్గర స్వల్పంగా ఉబ్బిందని వెల్లడించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో విలువైనదిగా భావిస్తున్న కరోనా టీకా ఇచ్చే సమయంలో నర్సు వహించిన నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

More Telugu News