అసెంబ్లీలో పీఆర్సీని ప్రకటించి ఉద్యోగులకు గుడ్న్యూస్ చెప్పిన కేసీఆర్
- ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్ల వేతన సవరణ అమలు
- 30 శాతం ఫిట్ మెంట్
- ఏప్రిల్ 30 నుంచి అమల్లోకి
- పదవీ విరమణ పరిమతి 61 ఏళ్లకు పెంపు
ఫిట్మెంట్తోపాటు, పదవీ విరమణ వయసు పెంపుపై కూడా క్లారిటీ ఇచ్చారు. 30 శాతం ఫిట్ మెంట్ ఇస్తున్నట్టు కేసీఆర్ తెలిపారు. ఈ నిర్ణయం ఏప్రిల్ 30 నుంచి అమల్లోకి రానున్నట్టు తెలిపారు. తాను ఉద్యోగ సంఘాల నేతలతో పలుసార్లు ఈ విషయంపై చర్చించానని ఆయన అన్నారు.
కరోనా, ఆర్థిక మాంద్యం కారణంగానే ఈ ప్రకటన ఆలస్యం అయిందని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని తెలిపారు. అన్ని విభాగాల ఉద్యోగులు అందరికీ పీఆర్సీ వర్తిస్తుందని ప్రకటించారు. అంటే ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులతో పాటు పింఛనుదారులు, ఔట్ సోర్స్, ఒప్పంద ఉద్యోగులు, హోంగార్డులు, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, సెర్ప్ ఉద్యోగులు, విద్యా వాలంటీర్లు, కేబీబీవీ సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులకూ పీఆర్సీ ప్రయోజనాలు అందుతాయి.
తాము మానవీయ కోణంలో ఆలోచించి వేతనాలు పెంచామని కేసీఆర్ తెలిపారు. అలాగే, ప్రమోషన్ల తర్వాత ఏర్పడే ఖాళీలను భర్తీ చేస్తామని తెలిపారు. పదవీ విరమణ పరిమతిని 61 ఏళ్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. అర్హులైన ఉద్యోగులు, ఉపాధ్యాయులందరికీ పదోన్నతులు ఇస్తామని, ఈ ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తామని చెప్పారు.
పదోన్నతుల తర్వాత ఏర్పడే ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని ప్రకటించారు. విశ్రాంత ఉద్యోగులు పూర్తిస్థాయి పింఛను పొందే అర్హత వయసును కూడా తగ్గిస్తున్నట్లు చెప్పారు. 75 సంవత్సరాల నుంచి 70 ఏళ్లకు తగ్గిస్తున్నట్లు వివరించారు.