COVID19: పెళ్లిళ్లు, కార్యాల వల్లే కరోనా విజృంభణ: నీతి ఆయోగ్

Weddings and gatherings ignoring Covid norms led to coronavirus case surge
  • ప్రజలు నిర్లక్ష్యంగా ఉన్నారన్న వీకే పాల్
  • కరోనా నిబంధనలు పాటించట్లేదని ఆందోళన
  • గ్రామాల్లో ఉన్న వారికి ముప్పు ఎక్కువని వెల్లడి
నెల రోజుల కిందట.. రోజులో అతి తక్కువ కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత తగ్గుతూ.. పెరుగుతూ వచ్చాయి. కానీ, వారం రోజుల నుంచి పరిస్థితి మొత్తం తిరగబడిపోయింది. మళ్లీ రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. శనివారం 40 వేల మార్కును దాటేశాయి. కారణమేంటి? అంటే.. అక్షరాలా జనాల నిర్లక్ష్యమే అని ప్రభుత్వ నిపుణులు తేల్చి చెబుతున్నారు. మాస్కులు పెట్టుకోకపోవడం, కరోనా నిబంధనలను పాటించకపోవడం వల్లే మహమ్మారి మళ్లీ ముసురుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కరోనా అంటే జనాల్లో భయం పోయిందని, నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ అన్నారు. కరోనా నిబంధనలను అస్సలు పట్టించుకోవట్లేదన్నారు. భౌతిక దూరం పాటించట్లేదని, జాగ్రత్తలు లేకుండానే ఇష్టమొచ్చినట్టు పెళ్లిళ్లు, కార్యాలకు వెళుతున్నారని అన్నారు. తగ్గినట్టే తగ్గిన కరోనా మళ్లీ పెరగడానికి కారణం అదేనన్నారు.

‘‘పరిస్థితిని చూస్తుంటే కచ్చితంగా అదే అనిపిస్తోంది. ప్రజల్లో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కరోనా ముప్పు పొంచి ఉన్న వారు చాలా మంది ఉన్నారన్న విషయాన్ని అందరూ గ్రహించాలి. ప్రత్యేకించి గ్రామాల్లోని వారికి ఆ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి టైంలో కరోనా కట్టడి కాడిని వదిలేయడం మంచిది కాదు. ప్రజలెవరూ అనవసరంగా గుమిగూడకూడదు. అదే కరోనా విజృంభించేందుకు ఎక్కువగా కారణమవుతోంది’’ అని వీకే పాల్ చెప్పారు.
COVID19
Niti Aayog
VK Paul
Weddings

More Telugu News