ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపిన విండీస్ క్రికెట్ దిగ్గజాలు

Caribbean cricket legends thanked PM Modi for sending corona vaccine
  • 'వ్యాక్సిన్ మైత్రి' కార్యక్రమం చేపట్టిన భారత్
  • పేద దేశాలకు కరోనా వ్యాక్సిన్ అందజేత
  • వెస్టిండీస్ దీవులకు కూడా భారత్ నుంచి వ్యాక్సిన్ డోసులు
  • మోదీకి ధన్యవాదాలు తెలిపిన రిచర్డ్స్ తదితరులు
కరోనా కష్టకాలంలో పేద దేశాలకు కరోనా వ్యాక్సిన్ అందిస్తూ భారత్ ఓ ఆశాదీపంలా మారింది. తాజాగా వెస్టిండీస్ దేశాలకు కూడా భారత్ కరోనా వ్యాక్సిన్ డోసులు పంపించింది. ఈ నేపథ్యంలో విండీస్ క్రికెట్ దిగ్గజాలు భారత ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. వివియన్ రిచర్డ్స్, రిచీ రిచర్డ్సన్, రామ్ నరేశ్ శర్వాన్, జిమ్మీ ఆడమ్స్ వంటి మాజీ క్రికెటర్లు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలుపుకున్నారు.

అలనాటి విధ్వంసక వీరుడు రిచర్డ్స్ ఓ వీడియో సందేశంలో స్పందిస్తూ... అద్భుతమైన సౌహార్ద్ర చర్యలతో భారత్ ఆకట్టుకుంటోందని, ఆంటిగ్వా అండ్ బార్బుడా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని వెల్లడించారు. ఇరుదేశాల మధ్య భవిష్యత్తులోనూ ఇలాంటి స్నేహసంబంధాలే కొనసాగాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలో స్నేహ హస్తం చాచిన భారత ప్రజలకు కూడా కృతజ్ఞతలు అంటూ రిచర్డ్స్ పేర్కొన్నారు.

భారత్ 'వ్యాక్సిన్ మైత్రి' కార్యక్రమంలో భాగంగా 80 వేల మేడిన్ ఇండియా కరోనా వ్యాక్సిన్లను గయానా దేశానికి అందజేసింది. 40 వేల వ్యాక్సిన్లను ఆంటిగ్వా అండ్ బార్బుడాకు పంపింది. జమైకా, బార్బడోస్, సెయింట్ లూషియా, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ దీవులు కూడా భారత్ నుంచి కరోనా వ్యాక్సిన్ డోసులు అందుకున్నాయి.
Go Back to Shorts
Narendra Modi
Richards
Richardson
Sarwan
Corona Vaccine
Vaccine Maitri
West Indies
India

More Telugu News