9, 10, 11 తరగతులకు పరీక్షలను రద్దు చేసిన తమిళనాడు ప్రభుత్వం

9, 10, 11 తరగతుల విద్యార్థులు పరీక్షలు లేకుండానే తదుపరి క్లాసులకు ప్రమోట్ అయ్యేలా తమిళనాడు ప్రభత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా నేపథ్యంలో, చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ తరగతుల విద్యార్థులను ప్రమోట్ చేస్తున్నట్టు ముఖ్యమంత్రి పళనిస్వామి తెలిపారు. దేశంలో కరోనా తీవ్రత మళ్లీ పెరుగుతోందని, ఈ పరిస్థితుల్లో విద్యార్థుల ఆరోగ్యం తమకు చాలా ముఖ్యమని ఆయన అన్నారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా పరీక్షలను రద్దు చేస్తున్నట్టు చెప్పారు. ఇంటర్నల్ పరీక్షల ఆధారంగా పబ్లిక్ పరీక్షల్లో మార్కులు వేస్తామని తెలిపారు.

80 శాతం మార్కులను త్రైమాసిక, అర్ధ సంవత్సర పరీక్షల ఆధారంగా లెక్కించి, మిగిలిన 20 శాతం మార్కులు హాజరు ఆధారంగా ఇస్తామని చెప్పారు. 12వ తరగతి పబ్లిక్ పరీక్షలు మే 3 నుంచి 21 వరకు జరగనున్నాయి. ఇదే సమయంలో పళనిస్వామి మరో కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 59 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచుతున్నట్టు ప్రకటించారు.


More Telugu News