Teja: నాటి 'చిత్రం' సినిమాకి సీక్వెల్ రూపొందిస్తున్న తేజ!

Teja makes sequel to Chitram movie
  • ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన 'చిత్రం'
  • హీరోగా ఉదయ్ కిరణ్ పరిచయం
  • దర్శకుడిగా మారిన కెమెరామేన్ తేజ
  • 'చిత్రం 1.1'గా సీక్వెల్ నిర్మాణం  
దాదాపు ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన 'చిత్రం' సినిమా ఒక సంచలనం. అతితక్కువ బడ్జెట్టులో ఉషాకిరణ్ మూవీసీ నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కనకవర్షం కురిపించింది. సరికొత్త ట్రెండుకి శ్రీకారం చుట్టింది. అప్పటివరకు కెమేరామేన్ గా రాణిస్తున్న తేజ ఈ చిత్రంతో దర్శకుడిగా మారి సత్తా చాటారు. అలాగే ఉదయ్ కిరణ్ ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయమై తదనంతర కాలంలో పలు సినిమాలు చేశాడు. అలాగే హీరోయిన్ రీమాసేన్ కూడా టాలీవుడ్ కి పరిచయమైంది. ఇక ఈ చిత్రానికి సంగీతం సమకూర్చిన ఆర్ఫీ పట్నాయక్ మరెన్నో హిట్ చిత్రాలకు సంగీతాన్ని అందించి సంగీత దర్శకుడిగా రాణించారు.

ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ నిర్మిస్తుండడం విశేషం. 'చిత్రం 1.1' పేరుతో దీనిని నిర్మిస్తున్నట్టు పేర్కొంటూ, దర్శకుడు తేజ ఈ రోజు టైటిల్ లోగోతో కూడిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. తేజ చిత్ర నిర్మాణ సంస్థ చిత్రం మూవీస్, ఎన్ స్టూడియోస్ కలసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇక 'చిత్రం'లోలానే ఇందులో కూడా కొత్త వాళ్లను పరిచయం చేస్తున్నారు. వచ్చే నెల నుంచి షూటింగును నిర్వహిస్తారు. దీనికి కూడా ఆర్ఫీ పట్నాయక్ సంగీతాన్ని సమకూర్చనున్నారు.
Teja
Uday Kiran
Rema Sen
RP Patnaik

More Telugu News