కేరళలో బీజేపీని పెద్దగా పట్టించుకోనక్కర్లేదు... శ్రీధరన్ సంగతి సరేసరి!: శశి థరూర్

  • త్వరలో కేరళ అసెంబ్లీ ఎన్నికలు
  • బీజేపీలో చేరుతున్న మెట్రోమ్యాన్ శ్రీధరన్
  • బీజేపీకి పెద్దగా సీట్లు రావన్న థరూర్
  • శ్రీధరన్ ప్రభావం అంతంతమాత్రమేనని వెల్లడి
  • శ్రీధరన్ ప్రకటన ఆశ్చర్యానికి గురిచేసిందన్న కాంగ్రెస్ ఎంపీ
దేశంలో మెట్రోరైల్ ప్రజారవాణా వ్యవస్థకు ఆద్యుడు, మెట్రోమ్యాన్ గా గుర్తింపు పొందిన శ్రీధరన్ త్వరలోనే బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. పార్టీ ఆదేశిస్తే కేరళ సీఎం పగ్గాలు చేపడతానని శ్రీధరన్ అంటున్నారు. దీనిపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ స్పందించారు. కేరళలో బీజేపీ గురించి పెద్దగా పట్టించుకోనవసరంలేదని, ఆ పార్టీకి ఏవో కొన్ని సీట్లు లభించవచ్చని అన్నారు. ఇక శ్రీధరన్ సంగతికొస్తే, ఆయనేమీ కేరళ రాజకీయాల్లో ప్రభావం చూపిస్తారనుకోవడంలేదని వ్యాఖ్యానించారు. రానున్న కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ప్రభావం అంతంతమాత్రమేనని తెలిపారు.

2016 ఎన్నికల్లో ఒక్క సీటు గెలిచిన బీజేపీకి ఈసారి మరింత ప్రతికూలత తప్పదని థరూర్ అభిప్రాయపడ్డారు. శ్రీధరన్ రాజకీయాల్లోకి వస్తున్నారన్న వార్త ఆశ్చర్యానికి గురిచేస్తే, అది కూడా బీజేపీలో చేరుతున్నారన్న ప్రకటన విస్మయానికి గురిచేసిందని అన్నారు. దేశంలో కీలక ఇంజినీరింగ్ ప్రాజెక్టులు చేపట్టిన శ్రీధరన్ కు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదని, ఆయన విభిన్న ప్రపంచంలోకి వస్తున్నారని వ్యాఖ్యానించారు.

Sashi Tharoor
Sridharan
BJP
Kerala
Assembly Elections

More Telugu News