వేలం అనే పదం క్రికెట్ గొప్పదనాన్ని దిగజార్చే విధంగా ఉంది: ఐపీఎల్ వేలంపై టీడీపీ నేత సోమిరెడ్డి వ్యాఖ్యలు

  • నిన్న చెన్నైలో ఐపీఎల్ వేలం
  • కోట్లు పోసి ఆటగాళ్లను కొనుక్కున్న ఫ్రాంచైజీలు
  • ఇది ఓ రకంగా బానిసత్వమేనన్న సోమిరెడ్డి
  • ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని బీసీసీఐకి సూచన
నిన్న జరిగిన ఐపీఎల్ వేలంలో ఆటగాళ్ల కొనుగోలు కోసం ఫ్రాంచైజీలు కోట్లు ఖర్చు చేయడంపై టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. వేలం అనే పదం క్రికెట్ గొప్పదనాన్ని దిగజార్చే విధంగా ఉందని అభిప్రాయపడ్డారు. భారత్ లో సినీ స్టార్లు, రాజకీయనేతలకు కూడా లేని తరహాలో దేవుళ్లు అనే రీతిలో అభిమానం పొందడం క్రికెటర్లకే చెల్లుతుందని తెలిపారు. క్రికెటర్లు కఠోర పరిశ్రమ, నైపుణ్యంతో ఆ క్రేజ్ సంపాదిస్తారని వివరించారు.

"ఎప్పుడైతే ఆ ప్రతిభను వేలం వేస్తారో అప్పుడు కార్పొరేట్లు కొనుగోలు చేస్తారు. పాత రోజుల్లో బానిసత్వానికి దీనికి తేడా లేదు. సరిగ్గా అలాగే అనిపిస్తోంది. క్రికెట్ పై ఎంతో ఆసక్తి ఉన్న వ్యక్తిగా ఆటగాళ్ల వేలం ప్రక్రియతో నా మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పగలను. వేలం అనేందుకు బదులుగా పారితోషికం, గౌరవ నజరానా అనే ప్రత్యామ్నాయాలను ఉపయోగించవచ్చు. ఈ మేరకు నా సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని బీసీసీఐని కోరుతున్నాను" అంటూ సోమిరెడ్డి వ్యాఖ్యానించారు.


More Telugu News

Somireddy Chandra Mohan Reddy IPL 2021 Auction Cricket BCCI India