Revanth Reddy: తెలంగాణ మొత్తం పర్యటిస్తా.. కేసీఆర్ ను కమ్మేస్తా: రేవంత్ రెడ్డి

Revanth Reddy fires on KCR
షార్ట్స్‌లో చూడండి
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతునని చెప్పుకుంటుంటారని... అలాంటప్పుడు రైతులకు అండగా ఆయన ఎందుకు ఉండటం లేదని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ చెప్పిన విధంగా పంటలు వేసిన రైతులకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు కనీస మద్దతు ధరను ఇవ్వకుండా... రైతు చనిపోతే రైతు బీమా ఇస్తామని చెప్పడం దారుణమని అన్నారు. పల్లీలు, బఠానీలకు భూములను లాక్కున్న ప్రభుత్వం... అవే భూములను ప్రైవేట్ కంపెనీలకు కోట్లకు అమ్ముకుంటోందని విమర్శించారు. కడ్తాల్, కందుకూరు రైతుల మీద పెట్టిన కేసులను ఎత్తేయాలని డిమాండ్ చేశారు.

కుప్పగండ్లతో ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గిరిజనులకు చెందిన 400 ఎకరాల భూములను తమవారి పేరు మీద బదిలీ చేయించుకున్నారని రేవంత్ ఆరోపించారు. తక్షణమే ఆ భూములను గిరిజనులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆ భూముల వద్దకు తాము వెళ్తామని హెచ్చరించారు. తెలంగాణకు పట్టిన గులాబీ చీడను వదిలించాల్సిన సమయం ఆసన్నమైందని... మనకోసం ఎవరూ రారని, మనకు మనమే దిక్కని, రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవడానికి యువత ముందుకు రావాలని సూచించారు.

ప్రధాని మోదీ, కేసీఆర్ మధ్య లోపాయకారీ ఒప్పందం ఉందని రేవంత్ అన్నారు. మోదీ చెప్పే అబద్ధాలను ప్రచారం చేయడానికే కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవిని ఇచ్చారని అన్నారు. మోదీ అబద్ధాలు చెపుతున్నప్పుడు... కిషన్ రెడ్డి నిజాలు ఎలా చెపుతారని ఎద్దేవా చేశారు. తాను తెలంగాణ మొత్తం పర్యటిస్తానని, కేసీఆర్ ని కమ్మేస్తామని అన్నారు. పార్టీ హైకమాండ్ అనుమతితోనే రాష్ట్రంలో తిరుగుతానని చెప్పారు. తమ పార్టీ నేతలు చేపట్టబోయే అన్ని పాదయాత్రలకు హాజరవుతానని తెలిపారు.
Go Back to Shorts
Revanth Reddy
Congress
KCR
TRS
Narendra Modi
BJP

More Telugu News