స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోలేని ముఖ్యమంత్రి ప్రత్యేక హోదా సాధిస్తారా?: నారా లోకేశ్

  • విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం నిర్ణయం
  • విశాఖలో మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు దీక్ష
  • దీక్షకు మద్దతు పలికిన నారా లోకేశ్
  • బుల్లెట్ లేని గన్ జగన్ అంటూ వ్యాఖ్యలు
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలన్న కేంద్రం నిర్ణయాన్ని నిరసిస్తూ వైజాగ్ లో మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. పల్లా దీక్ష శిబిరం వద్దకు ఇవాళ టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ విచ్చేశారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోలేని ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తారా? అని వ్యాఖ్యానించారు. వైఎస్ విజయలక్ష్మిని ఓడించారనే కక్షతోనే సీఎం జగన్ విశాఖ ప్రజలను వేధిస్తున్నారని ఆరోపించారు.

151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు ఉండి జగన్ సర్కారు ఏం సాధించగలిగిందని ప్రశ్నించారు. బుల్లెట్ లేని గన్ జగన్ అని ఈ సందర్భంగా వ్యంగ్యం ప్రదర్శించారు. ఈ గన్ ను నొక్కితే నీళ్లు బయటికి వస్తున్నాయని ఎద్దేవా చేశారు. ప్రైవేటీకరణపై సీఎం లేఖ రాశారని చెప్పుకుంటున్నారని, ఢిల్లీలో విచారిస్తే అసలు ఆ లేఖే రాలేదని తెలిసిందని లోకేశ్ వివరించారు. అసలు మోదీకి లేఖ రాసే స్థితిలో ఈ సీఎం ఉన్నారా? అని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Nara Lokesh
Jagan
Steel Plant
Privatisation
Andhra Pradesh

More Telugu News