Parliament: చర్చల తర్వాతే వ్య‌వ‌సాయ‌ చట్టాలు ఆమోదం పొందాయి: పార్ల‌మెంటులో రాష్ట్ర‌ప‌తి

  • రైతుల సంక్షేమం కోసమే కొత్త‌ సాగు చట్టాలు
  • రైతులకు కొత్త అవకాశాలు, హక్కులు
  • సుప్రీంకోర్టు  ఆదేశాల మేరకే సాగు చట్టాలపై కేంద్రం నిర్ణ‌యాలుంటాయి
  • గ‌త ఏడాది ఎన్నో స‌వాళ్లు ఎదుర‌య్యాయి
  • క‌రోనాయే కాకుండా తుపాన్లు, బ‌ర్డ్‌ఫ్లూ స‌మ‌స్య‌లొచ్చాయి
President Addresses Joint Sitting Of Parliament

రైతుల సంక్షేమం కోసమే కేంద్ర ప్ర‌భుత్వం కొత్త‌ సాగు చట్టాలను తీసుకొచ్చింద‌ని రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్ చెప్పారు. పార్ల‌మెంటు బ‌డ్జెట్ స‌మావేశాల ప్రారంభం సంద‌ర్భంగా ఆయ‌న ఉభ‌య స‌భ‌లనుద్దేశించి మాట్లాడుతూ.. కొత్త‌ సాగు చట్టాలతో రైతులకు కొత్త అవకాశాలు, హక్కులు లభిస్తాయని తెలిపారు.

విస్తృత చర్చల అనంత‌రం కొత్త చట్టాలు పార్లమెంటులో ఆమోదం పొందాయ‌ని కోవింద్ తెలిపారు. స్వామినాథన్‌ కమిషన్ చేసిన‌ సిఫార్సుల ప్రకార‌మే కేంద్ర ప్ర‌భుత్వం మద్దతు ధరలను పెంచుతోందని చెప్పారు. అలాగే, సుప్రీంకోర్టు ఇచ్చిన‌ ఆదేశాల మేరకు సాగు చట్టాలపై కేంద్ర‌ ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని తెలిపారు.

కాగా, గ‌త ఏడాది క‌రోనాయే కాకుండా తుపాన్ల నుంచి బ‌ర్డ్‌ఫ్లూ వ‌ర‌కు దేశం ఎన్నో స‌వాళ్ల‌ను ఎదుర్కొందని రాష్ట్ర‌ప‌తి కోవింద్ తెలిపారు. ప్ర‌తి స‌మ‌స్య‌ను దేశ‌మంతా ఒక్క‌టిగా ఎదుర్కొందని చెప్పారు. క‌రోనా వైర‌స్ చాలా మంది ప్రాణాల‌ను బ‌లి తీసుకుందని, ఎంద‌రో మ‌హ‌నీయుల ప్రాణాలు తీసిందని గుర్తు చేశారు.

ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ వంటి నేత‌లు క‌రోనాతో మ‌ర‌ణించారని అన్నారు. కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌న నిర్మాణం కోసం గ‌త ప్ర‌భుత్వాలు ప్ర‌య‌త్నించాయని, స్వాతంత్య్రం వ‌చ్చి 75 ఏళ్లు పూర్త‌వుతున్న ప్రస్తుత స‌మ‌యంలో కొత్త పార్ల‌మెంట్ నిర్మాణం జ‌రుగుతుండ‌డం సంతోష‌క‌రమ‌ని తెలిపారు.

దేశంలోకి విదేశీ పెట్టుబ‌డులు గ‌ణ‌నీయంగా పెరిగాయని చెప్పారు. దేశంలో మౌలిక స‌దుపాయాల‌ను ప్ర‌భుత్వం గ‌ణ‌నీయంగా అభివృద్ధి చేస్తోందని తెలిపారు. చెన్నై నుంచి పోర్ట్‌బ్లెయిర్ వ‌ర‌కూ ఆప్టిక‌ల్ ఫైబ‌ర్ ద్వారా అంత‌ర్జాల సేవ‌లు అందుతున్నాయ‌ని చెప్పారు. న‌గ‌రాల్లో పేద‌ల కోసం 40 ల‌క్ష‌ల ఇళ్లు నిర్మించి ఇచ్చామ‌న్నారు.

దేశంలో కిసాన్‌ సమ్మాన్‌ నిధి ద్వారా రైతుల ఖాతాల్లోకి న‌గదును బదిలీ చేస్తున్న‌ట్లు కోవింద్ గుర్తు చేశారు. వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధికి రూ.లక్ష కోట్లతో ప్రత్యేక నిధి ప్రారంభించిన‌ట్లు తెలిపారు. అలాగే, దేశంలో మత్స్యకారుల కోసం రానున్న ఐదేళ్లలో రూ.20 వేల కోట్లను ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.

More Telugu News