Hardik Pandya: పాండ్యా సోదరుల తండ్రి మృతి.. స్పందించిన కోహ్లీ

  • గుండెపోటుతో మరణించిన హిమాన్షు పాండ్యా
  • బయోబబుల్ ను వీడి వచ్చేసిన కృనాల్ పాండ్యా
  • హిమాన్షు ఎప్పుడూ సంతోషంగా ఉండేవారన్న కోహ్లీ
  • అన్నీ సాధించిన భావన కనిపించేదని వ్యాఖ్య
Krunal and Hardik Pandya father passes away

టీమిండియా ఆల్ రౌండర్లు హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా ఇంట విషాదం నెలకొంది. వారి తండ్రి హిమాన్షు పాండ్యా శనివారం ఉదయం గుండెపోటుతో చనిపోయారు. దీంతో ప్రస్తుతం సయ్యద్ ముస్తాఖ్ అలీ ట్రోఫీలో ఆడుతున్న కృనాల్ పాండ్యా బయో బబుల్ ను వీడి ఇంటికి వచ్చేశాడు. ఇటు హార్దిక్ పాండ్యా.. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ అయిపోయాక నెల క్రితమే ఇండియాకు తిరిగొచ్చాడు.

తమ కెరీర్ కోసం తల్లిదండ్రులు ఎంతో కష్టపడేవారని పాండ్యా సోదరులు ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. సూరత్ లో కార్ ఫైనాన్స్ వ్యాపారం చేసే హిమాన్షు.. తన కుమారుల కెరీర్ కోసం ఆ వ్యాపారాన్ని వదిలేసి మకాంను వడోదరకు మార్చాడు. టీమిండియా మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరె క్రికెట్ అకాడమీలో ఇద్దరినీ చేర్పించి శిక్షణ ఇప్పించాడు.

కాగా, హిమాన్షు మరణంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. ఆయన మరణం పట్ల విచారం వ్యక్తం చేశాడు. ఆయనతో రెండుమూడు సార్లు మాట్లాడానని, ఎప్పుడూ ఎంతో సంతోషంగా ఉండేవారని, జీవితంలో అన్నీ సాధించిన భావన ఆయనలో కనిపించేదని ట్వీట్ చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఇలాంటి టైంలోనే దృఢంగా ఉండాలంటూ హార్దిక్, కృనాల్ కు సానుభూతి తెలిపాడు.

More Telugu News