అంతటి శక్తి ఉన్న మీపై గెరిల్లా యుద్ధం చేయడానికి ఎవరు సాహసిస్తారు చెప్పండి?: సీఎం జగన్ కు పవన్ కల్యాణ్ సూటిప్రశ్న
- ఏపీలో కొనసాగుతున్న ఆలయాలపై దాడులు
- ఘాటుగా స్పందించిన పవన్ కల్యాణ్
- ఆడలేక మద్దెల ఓడు అన్నట్టుగా ఉందని సీఎంపై వ్యాఖ్యలు
- త్వరలోనే దోషులను పట్టుకోవాలని హితవు
"మీరు ఎంతటి శక్తిమంతులో దేశ ప్రజలందరికీ తెలుసు. మీరు ఒక్క లేఖ రాస్తే హైకోర్టు సీజేలు, జడ్జిలు క్షణంలో బదిలీ అయిపోతారు. అంతటి శక్తి ఉన్న మీపై గెరిల్లా యుద్ధం చేయడానికి ఎవరు సాహసిస్తారు చెప్పండి. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు, 115 మంది ఐపీఎస్ లు, 115 మంది అదనపు ఎస్పీలు, వేలమంది పోలీసులు మీ చేతుల్లో ఉండగా విగ్రహాలను ధ్వంసం చేసినవారిని పట్టుకోలేకపోవడం విడ్డూరంగా ఉంది.
సోషల్ మీడియాలో మీపైనా, మీ పార్టీ పైనా పోస్టులు పెట్టేవారిపైనా, నిస్సహాయుడైన డాక్టర్ సుధాకర్ వంటి వారిపైనా అత్యుత్సాహంతో కేసులు పెట్టే పోలీసులు దేవుడి విగ్రహాలను ధ్వంసం చేసినవారిని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? రాష్ట్రంలో 2.60 లక్షల మంది వలంటీర్లను నియమించారు కదా.. వారు కూడా సమాచారం ఇవ్వలేకపోతున్నారా? ఎక్కడ ఉంది మీ లోపం.. మీలోనా... మీ నీడలో ఉన్న వ్యవస్థలోనా?" అంటూ విమర్శలు గుప్పించారు.
పైగా విపక్షాలన్నింటినీ ఒకే గాటన కట్టడం ఆడలేక మద్దెల ఓడు అన్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు. గత రెండేళ్లుగా ఎంతో సహనంతో ఉన్న పీఠాధిపతులు సైతం రోడ్లపైకి రావలసిన పరిస్థితిని ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందని పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఇకనైనా మాటలు కట్టిపెట్టి దోషులను పట్టుకుని, వారిని ప్రజల ముందు నిలపాలని హితవు పలికారు.