వెళ్లాలనుకుంటే వెళ్లచ్చు...ఉద్యోగులకు వీఆర్ఎస్ ప్రకటించిన హోండా!

HMSI Announce VRS to Employees
  • ఇండియాలో రెండో అతిపెద్ద సంస్థగా ఉన్న హెచ్ఎంఎస్ఐ
  • 40 ఏళ్లు పైబడి పదేళ్ల సర్వీస్ ఉన్న వారికి వర్తింపు
  • యువతను విధుల్లోకి తీసుకోవాలని భావిస్తున్న సంస్థ
ఇండియాలో అత్యధికంగా మోటార్ సైకిళ్లను విక్రయిస్తున్న రెండో అతిపెద్ద సంస్థగా ఉన్న హెచ్ఎంఎస్ఐ (హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా), తన ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ అవకాశాన్ని ప్రకటించింది. సంస్థలో 50 ఏళ్ల పైబడిన వారి స్థానంలో యువతను తీసుకోవాలని భావిస్తున్న సంస్థ, అందుకు మార్గాలను సిద్ధం చేసుకుంటూ వీఆర్ఎస్ ను ప్రకటించింది. తమ ప్రొడక్షన్ వ్యూహాన్ని మార్చుకుంటున్నామని, ఈ అనిశ్చిత పరిస్థితుల్లో ఉద్యోగులను తగ్గించుకోవాల్సిన అవసరం కూడా ఉందని భావిస్తున్నామని సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు.

హోండా మోటార్ సైకిల్ సంస్థలో 40 ఏళ్లు పైబడి, పదేళ్లకు మించి పనిచేస్తున్న వారంతా ఈ వీఆర్ఎస్ స్కీమ్ కు అర్హులేనని సంస్థ ప్రకటించింది. కాగా, పక్షం రోజుల క్రితం హోండా కార్స్ సైతం ఇదే విధమైన వీఆర్ఎస్ స్కీమ్ ను ప్రకటించింది. సంస్థ ప్రధాన తయారీ కేంద్రమైన రాజస్థాన్ తపుకరా ప్లాంట్ లోని ఉద్యోగులందరికీ, ఈ మేరకు లేఖలను పంపించింది. ఆపై హర్యానాలోని మనేసర్, రాజస్థాన్ లోని అల్వార్, కర్ణాటకలోని నరసాపురా, గుజరాత్ లోని విఠల్ పురా ప్లాంట్ల ఉద్యోగులకూ ఇదే సమాచారాన్ని పంపింది.

ప్రస్తుతం హోండా మోటార్ సైకిల్స్ సంస్థ సాలీనా 64 లక్షల వాహనాలను తయారు చేసి విక్రయించే సామర్థ్యాన్ని కలిగివుంది. భారత వాహనరంగంలో నెలకొన్న పోటీ మేరకు మిగతా సంస్థలకు దీటుగా నిలవాలంటే ఇటువంటి మార్పులు తప్పనిసరని సంస్థ జనరల్ అఫైర్స్ విభాగం హెడ్ నవీన్ శర్మ వ్యాఖ్యానించారు. కంపెనీలో డైరెక్టర్లుగా ఉన్నవారు కూడా ఈ వీఆర్ఎస్ స్కీమ్ నకు అర్హులేనని ఆయన స్పష్టం చేశారు. జనవరి 23 వరకూ అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.  
Go Back to Shorts
HMSI
VRS
Honda
Letter

More Telugu News