తిడితే భయపడే రకాన్ని కాదు: దేవినేని ఉమ

  • టీడీపీ ఇచ్చిన పట్టాలను రద్దు చేసే అవకాశం ఎవరిచ్చారు?
  • వైసీపీవి దుర్మార్గపు విధానాలు
  • పేదల ఉసురు తగిలి తీరుతుందన్న దేవినేని
గతంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఇళ్ల పట్టాలను రద్దు చేసే అధికారం వైసీపీ ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారని మాజీ మంత్రి, తెలుగుదేశం అధికార ప్రతినిధి దేవినేని ఉమ మండిపడ్డారు. ఈ ఉదయం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన, గతంలో పట్టాలు పొంది, ఇప్పుడు వైసీపీ దుర్మార్గపు విధానంతో వాటిని కోల్పోయిన పేదల ఉసురు తగిలి తీరుతుందని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం ఉన్న సమయంలోనే ఏర్పాటు కాబడిన లేఔట్లకు ఇప్పుడు సిగ్గు లేకుండా వైసీపీ నేతలు తమ పేర్లు పెట్టుకుంటున్నారని ఆయన నిప్పులు చెరిగారు.

పురగుట్టలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పట్టాలు ఇప్పుడు రద్దు చేశారని వ్యాఖ్యానించిన ఆయన, తదుపరి తమ పార్టీయే అధికారంలోకి వస్తుందని, ఆ వెంటనే మళ్లీ ఎన్టీఆర్ పేరిట పట్టాలు ఇస్తామని అన్నారు. తనను తిడితేనో, నిజాలను ప్రజలకు చెప్పే పత్రికలను తిడితేనో తాను భయపడే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించిన ఆయన, రైతుల సమస్యలు తీర్చమని కోరితే దాడులు చేయిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాజన్న రాజ్యం పేరు చెప్పి, రైతులను ఊళ్లు వదిలి పోయేలా చేస్తున్నారని అన్నారు. అయ్యప్ప మాల వేసుకుని కూడా ఎమ్మెల్యే వసంత అబద్ధాలు చెబుతున్నారని వ్యాఖ్యానించారు.


More Telugu News

Devineni Uma YSRCP Telugudesam