వచ్చే వారం కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ కు అత్యవసర వినియోగ అనుమతులు!
- బ్రిటన్ అనుమతివ్వగానే ఇక్కడా వచ్చే అవకాశాలున్నాయంటున్న ఉన్నతాధికారులు
- భారత్ బయోటెక్ కొవ్యాగ్జిన్ కు మరికొంత టైం
- ప్రస్తుతం మూడో దశ ట్రయల్స్ లో టీకా
ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనికా-సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా కలిసి తయారు చేస్తున్న కొవిషీల్డ్ ను ఆమోదించే అవకాశం ఉందంటున్నారు. ఆక్స్ ఫర్డ్ కరోనా టీకాకు బ్రిటన్ ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదం తెలిపిన వెంటనే.. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ) సమావేశమవుతుందని, వ్యాక్సిన్ భద్రత, రోగనిరోధకత డేటాలను విశ్లేషించి నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
అయితే, భారత్ బయోటెక్ తయారు చేస్తున్న కొవ్యాగ్జిన్ టీకా మూడో దశ ప్రయోగాలు జరుగుతున్నందున, దానికి అనుమతులొచ్చేందుకు కొంత టైం పట్టే అవకాశాలున్నాయని చెప్పారు. ఫైజర్ కూడా అనుమతులకు దరఖాస్తులు చేసిందన్నారు. అయితే, వ్యాక్సిన్ కు సంబంధించిన ట్రయల్స్ పై కంపెనీ ఇంకా సమాచారాన్ని ఇవ్వాల్సి ఉందని చెప్పారు.
వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుంటే ఇప్పటికే అడ్వాన్స్ దశలో ఉన్న కొవిషీల్డ్ కే ప్రభుత్వం మొగ్గు చూపే అవకాశం ఉందని వివరించారు. వ్యాక్సిన్ భద్రత, ట్రయల్స్ సమాచారాన్ని ఇదివరకే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కు ఇచ్చింది.