ఆందోళనలతో అలసిన రైతులకు.. మసాజ్ సెంటర్లను ఏర్పాటు చేసిన ఖల్సా
- వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న రైతుల ఆందోళనలు
- వృద్ధ రైతుల కోసం మసాజ్ సెంటర్లు ఏర్పాటు
- వాటర్ ప్రూఫ్ టెంట్లు, బాత్రూమ్ లను కూడా ఏర్పాటు చేసిన ఖల్సా
మరోవైపు ఢిల్లీ శివార్లలోని సింగు సరిహద్దు వద్ద నిరసనలు చేపట్టిన రైతులకు ఎన్జీవో సంస్థ ఖల్సా మసాజ్ సెంటర్లను ఏర్పాటు చేసింది. నిరనలు చేస్తూ అలసిపోయిన వృద్ధ రైతులకు తమ వంతు బాధ్యతగా ఫుట్ మసాజ్ సెంటర్లను ఏర్పాటు చేశామని ఖల్సా మేనేజింగ్ డైరెక్టర్ అమర్ ప్రీత్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. దీంతోపాటు 400 వాటర్ ప్రూఫ్ టెంటులు, గ్లిజరిన్ సదుపాయం ఉన్న బాత్రూమ్ లను ఏర్పాటు చేశామని చెప్పారు.
నిరసన కార్యక్రమాలు మొదలైన తొలి నుంచి అందరికీ ఉచితంగా భోజన సదుపాయాన్ని కల్పిస్తున్నామని ఖల్సా వాలంటీర్ తేజ్ పాల్ సింగ్ తెలిపారు. విపరీతమైన చలి నుంచి రక్షించడానికి దుప్పట్లను సరఫరా చేయడం కోసం 10 ట్రక్కులను వినియోగించామని చెప్పారు. ఈ సేవల పట్ల రైతులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. చాలా దూరం ప్రయాణం చేసి ఇక్కడకు వచ్చిన తమకు మసాజ్ సెంటర్లను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని అన్నారు.