జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 45.97 శాతం పోలింగ్ నమోదు.. గతం కంటే కాస్త ఎక్కువే!

GHMC Elections polling percentage recorded slightly higher than last elections
  • 2016లో నమోదైన పోలింగ్ శాతం కంటే కొద్దిగా అధికం
  • ముగిసే సమయంలో ఊపందుకున్న పోలింగ్
  • ఓల్డ్ మలక్‌పేట డివిజన్‌లో రేపు రీపోలింగ్
నిన్న జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 45.97 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల అధికారి లోకేశ్ కుమార్ తెలిపారు.  జీహెచ్ఎంసీకి గతంలో జరిగిన ఎన్నికల్లో నమోదైన పోలింగ్‌ శాతంతో పోలిస్తే ఇది కొంచెం ఎక్కువే. 2016లో గ్రేటర్‌లో 45.27 శాతం పోలింగ్ నమోదు కాగా, ఈసారి అది స్వల్పంగా పెరిగి 45.97 శాతం నమోదు కావడం గమనార్హం. నిన్న ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, రోజంతా మందకొడిగా సాగింది. చాలా పోలింగ్ కేంద్రాల్లో సిబ్బందికి పనిలేకుండా పోయింది.

సాయంత్రం ఐదు గంటల సమయానికి కూడా 36.73 శాతం మాత్రమే పోలింగ్ నమోదు కావడం గమనార్హం. అయితే, పోలింగ్ మరికాసేపట్లో ముగుస్తుందనగా నెమ్మదిగా ఊపందుకోవడంతో ఆ మాత్రమైనా నమోదైంది. వరుసగా నాలుగు రోజులు సెలవులు రావడానికి తోడు కరోనా భయంతో పోలింగ్ కేంద్రాలకు రావడానికి జనం సంకోచించినట్టు తెలుస్తోంది. ఒక్క ఓల్డ్  మలక్‌పేట మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఇక్కడ రేపు రీపోలింగ్ నిర్వహించనున్నారు.
Go Back to Shorts
GHMC Elections
Hyderabad
Polling
Lokesh Kumar

More Telugu News