Arnab Goswami: అర్నాబ్ బెయిల్ పిటిషన్ పై విచారణ... వ్యక్తుల స్వేచ్ఛను కాపాడేందుకు మేమున్నామన్న సుప్రీంకోర్టు

Supreme Courts response on Arnabs bail plea
షార్ట్స్‌లో చూడండి
రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ ఛీప్ అర్నాబ్ గోస్వామి మధ్యంతర బెయిల్ పిటిషన్ ను ఈరోజు సుప్రీంకోర్టు విచారించింది. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టులో అర్నాబ్ తరపున ప్రముఖ లాయర్ హరీశ్ సాల్వే వాదించారు. మూసివేసిన కేసును మళ్లీ విచారించే అధికారాన్ని అర్నాబ్ పట్ల దారుణంగా ఉపయోగించారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ధర్మాసనం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ... ఒక వ్యక్తి వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం సరికాదని వ్యాఖ్యానించింది. ఈ పిటిషన్ ను జస్టిస్ డీవై చంద్రచూడ్, ఇందిరా బెనర్జీల ధర్మాసనం విచారించింది.

అర్నాబ్ ను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవరసం ఉందా? అని కూడా మహా ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. 'అర్నాబ్ భావజాలం ఏదైనా కావచ్చు. నేను ఆయన చానల్ ను కూడా చూడలేదు. అయితే ఈ సమయంలో ధర్మాసనం కలగజేసుకోకపోతే... మనం వినాశకర మార్గంలో వెళ్తున్నట్టే' అని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. ఒక వ్యక్తి స్వేచ్ఛను మీరు హరించగలరా? అని మహా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వ్యక్తులను టార్గెట్ చేయాలనుకునే రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకటే చెపుతున్నామని... ప్రజల స్వేచ్ఛను కాపాడటానికి సుప్రీంకోర్టు ఉందని చెపుతున్నామని అన్నారు.

తాము ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నామని సుప్రీంకోర్టు తెలిపింది. ఆర్థిక ఒత్తిడి కారణంగా ఇంటీరియర్ డిజైనర్ నాయక్ ఆత్మహత్య చేసుకున్నారని... ఇది ఒక వ్యక్తిని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించే కేసా? అని ప్రశ్నించింది. ఎఫ్ఐఆర్ పెండింగ్ లో ఉన్నప్పుడు బెయిల్ ఇవ్వకపోవడం చట్టాన్ని అపహాస్యం చేసినట్టే అవుతుందని వ్యాఖ్యానించింది.

నాయక్, ఆయన తల్లి ఇద్దరూ ఆత్మహత్య చేసుకునేలా అర్నాబ్ గోస్వామి ప్రేరేపించారనే కారణాలతో ఆయనను ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ముంబై హైకోర్టు కూడా ఆయనకు బెయిల్ ఇవ్వకపోవడంతో... ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Go Back to Shorts
Arnab Goswami
Republic TV
Supreme Court

More Telugu News