ఆయుర్వేద వైద్యంతో కరోనాకు అడ్డుకట్ట.. మార్గదర్శకాలు విడుదల చేసిన ఆయుష్ మంత్రిత్వశాఖ

AYUSH Ministrys COVID Remedies
  • రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసుకోవడం ద్వారా కరోనాకు చెక్
  • వంటింటి చిట్కాలతో కరోనాకు దూరం
  • మాస్కులు, భౌతిక దూరం తప్పనిసరన్న మంత్రిత్వ శాఖ
కరోనా వైరస్ వ్యాక్సిన్ అందుబాటులోకి ఎప్పుడు వచ్చేది స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ ఓ ప్రకటన చేసింది. రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసుకోవడం ద్వారా కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయవచ్చని, ఇందుకు ఆయుర్వేద వైద్యం ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొంది.  

కరోనాతోపాటు కాలానుగుణంగా వచ్చే వ్యాధులను ఆయుర్వేద విధానాలను అనుసరించడం ద్వారా అడ్డుకట్ట వేయవచ్చని వివరించింది. ఇందులో భాగంగా కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఏవైనా వస్తువులను తాకిన వెంటనే చేతులను సబ్బుతోకానీ, శానిటైజర్‌తో కానీ శుభ్రం చేసుకోవాలని, ముఖానికి మాస్కులు ధరించాలని, ఆరడుగుల భౌతిక దూరం పాటించాలని సూచించింది.

గోరువెచ్చని నీటిని తాగడం అలవాటు చేసుకోవడం ద్వారా శ్వాసకోస సమస్యలను నివారించవచ్చని , నిత్యం యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం అలవాటు చేసుకోవాలని సూచించింది. ఉదయాన్నే 10 గ్రాముల చ్యవన్‌ప్రాశ్ తీసుకోవాలని, మధుమేహం ఉన్నవారు తియ్యదనం లేని చ్యవన్‌ప్రాశ్‌ను తీసుకోవాలని పేర్కొంది. వీలైతే గోరువెచ్చని నీటిలో కాస్తంత పసుపు కలుపుకుని ఉదయం, సాయంత్రం వేళలో తాగాలని, వంటల్లో పసుపు, జీలకర్ర, కొత్తిమీర, వెల్లుల్లి వంటి వాటిని తప్పనిసరిగా వినియోగించాలని సూచించింది.

నువ్వులు, లేదంటే కొబ్బరి నూనెను నోటిలో వేసుకుని రెండుమూడు నిమిషాలు పుక్కిలించి ఉమ్మివేయాలని, అనంతరం గోరువెచ్చని నీటితో నోటిని శుభ్రం చేసుకోవాలని పేర్కొంది. పొడిదగ్గు ఉంటే తాజా పుదీనా ఆకులను వేడి నీటిలో వేసుకుని ఆవిరి పీల్చాలని, దగ్గు, గొంతులో చికాకు ఉంటే బెల్లం లేదంటే తేనె కలిపిన లవంగం పొడిని రెండుమూడు సార్లు తీసుకోవాలని సూచించింది. కరోనా నుంచి కోలుకున్న వారు గోరువెచ్చని నీటినే తాగాలని, ధూమపానం, మద్యపానం అలవాట్లను విడిచిపెట్టాలని తెలిపింది. అలాగే, సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
Go Back to Shorts
Corona Virus
ayush ministry
Yoga
remidies

More Telugu News