దర్శకుడిగా మారుతున్న భారతీరాజా తనయుడు

  • తెలుగు, తమిళ భాషల్లో రాణించిన భారతీరాజా 
  • తనయుడు ఇరవై ఏళ్ల క్రితం హీరోగా పరిచయం
  • కొన్నాళ్లకు దర్శకత్వం వైపు మళ్లిన మనోజ్ 
  • ప్రముఖ దర్శకుడు శంకర్ వద్ద అసిస్టెంట్   
హీరోల తనయులు హీరోలు అవ్వడం.. నిర్మాతల తనయులు నిర్మాతలుగా మారడం.. దర్శకుల తనయులు దర్శకులుగా రాణించడం మనం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. అలాగే తెలుగు, తమిళ భాషల్లో కొత్త ఒరవడితో పలు విజయవంతమైన చిత్రాలను రూపొందించి, దర్శకుడిగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న భారతీ రాజా తనయుడు మనోజ్ భారతీ రాజా కూడా ఇప్పుడు దర్శకుడిగా మారుతున్నాడు.

వాస్తవానికి మనోజ్ నటుడు. ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన 'తాజ్ మహల్' చిత్రం ద్వారా కోలీవుడ్ కి హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత మరికొన్ని సినిమాలలోనూ హీరోగా నటించాడు. అయితే, ఇవేవీ ఆశించిన రీతిలో విజయం సాధించకపోవడంతో హీరోగా సక్సెస్ కాలేకపోయాడు. దాంతో ఆమధ్య దర్శకత్వ శాఖలోకి ప్రవేశించాడు. 'రోబో' సినిమా నుంచి ప్రముఖ దర్శకుడు శంకర్ వద్ద కొన్ని సినిమాలకు పనిచేశాడు.

ఇక ఇప్పుడు సొంతంగా దర్శకత్వం వహించడానికి రెడీ అవుతున్నాడు. లిబ్రా ప్రొడక్షన్స్ అధినేత రవీంద్రన్ చంద్రశేఖరన్ నిర్మించే చిత్రానికి మనోజ్ దర్శకత్వం వహించనున్నాడు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదలైంది. వచ్చే జనవరి నుంచి ఈ చిత్రం షూటింగ్ జరుగుతుందనీ, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయనీ పేర్కొన్నారు.


More Telugu News

Bharathi Raja Manoj Shankar