ఆయుధ పూజ కోసం చైనా సరిహద్దులకు వెళ్లిన రాజ్ నాథ్ సింగ్!

Rajnath Singh Shastra Pooja near China Border
  • సిక్కిం చేరుకున్న రాజ్ నాథ్ సింగ్
  • 'త్రిశక్తి' దళాలతో కలిసి శస్త్ర పూజ
  • సైనికులకు శుభాకాంక్షలు తెలిపిన రక్షణ మంత్రి
విజయ దశమి పర్వదినం సందర్భంగా ఆయుధ పూజను చేసేందుకు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, చైనా సరిహద్దులకు వెళ్లారు. శస్త్ర పూజ కోసం సిక్కింలోని షిరాతంగ్ ప్రాంతానికి రాజ్ నాథ్ చేరుకున్నారు. వాస్తవాధీన రేఖకు కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఆయన ఆయుధ పూజను నేడు నిర్వహించనున్నారు. ఆపై సైనికులతో పండగ చేసుకోనున్నారు. లడాక్ రీజియన్ లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో సైన్యానికి సంఘీభావంగా దేశమంతా నిలిచివుందన్న సంకేతాలను పంపేందుకే రాజ్ నాథ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

సుక్నా కేంద్రంగా ఉన్న 33 క్రాప్స్ హెడ్ కర్వార్టర్స్ లో ఆయన భారత సైనిక ఆయుధ సంపత్తికి ప్రత్యేక పూజలు నిర్వహించారని సిక్కిం సెక్టార్ అధికారులు వెల్లడించారు. ఇక్కడి సైనిక దళాలను 'త్రిశక్తి'గా పిలుస్తారు. శనివారం నాడు సిక్కిం చేరుకున్న రాజ్ నాథ్ కు అక్కడి సైనిక అధికారులు స్వాగతం పలికారు. రెండు రోజుల పాటు రాజ్ నాథ్ పర్యటన సాగనుంది.

సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలను ఆనుకుని, దాదాపు 3,500 కిలోమీటర్ల పొడవైన సరిహద్దుల్లో నిత్యమూ చైనా నుంచి సవాళ్లు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయుధ పూజకు ఆ ప్రాంతాన్ని రాజ్ నాథ్ ఎంచుకున్నారని సమాచారం. తన పర్యటన సందర్భంగా క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న సైనికులను ప్రత్యేకంగా కలిసిన రాజ్ నాథ్, వారికి విజయ దశమి శుభాకాంక్షలు తెలియజేశారు.

Go Back to Shorts
Rajnath Singh
Dasara
Vijayadashami
Shastra Pooja

More Telugu News