Bimal Gurung: మూడేళ్ల అజ్ఞాతవాసం తరువాత తొలిసారిగా కోల్ కతాలో కనిపించిన గూర్ఖా నేత బిమల్ గురుంగ్!

Gurkha Chief Bimal Appered in Kolkata after 3 years
  • 2017 సెప్టెంబర్ లో అజ్ఞాతానికి
  • వచ్చే ఎన్నికల్లో మమతా బెనర్జీకి మద్దతు
  • ఆమె మరోమారు సీఎం అవుతారు
  • గూర్ఖా రాష్ట్రం కోసం పోరాడుతానన్న బిమల్
పశ్చిమ బెంగాల్ పరిధిలోని డార్జిలింగ్ కొండల ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని ఎంతోకాలంగా డిమాండ్ చేస్తున్న గూర్ఖా నేత, మూడు సంవత్సరాలుగా పోలీసులు వెతుకుతున్న బిమల్ గురుంగ్, కోల్ కతాలో ప్రత్యక్షమయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన, మమతా బెనర్జీని మరోమారు ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నట్టు వెల్లడించారు. వచ్చే సంవత్సరం జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర బెంగాల్ పరిధిలోని అన్ని స్థానాల్లోనూ తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించేందుకు తాను కృషి చేస్తానని అన్నారు.

ఈ మూడు సంవత్సరాలూ తాను న్యూఢిల్లీలో ఉన్నానని, ఈ మూడేళ్లూ బీజేపీని చూశానని, వారు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేదని విమర్శలు గుప్పించారు. ఇదే సమయంలో మమతా బెనర్జీ ప్రజల సంక్షేమానికి పాటుపడుతున్నారని, అందుకే వచ్చే ఎన్నికల్లో ఆమెకు మద్దతుగా నిలుస్తానని అన్నారు.

కాగా, 2017లో మమతా బెనర్జీని ఓ దెయ్యంగా అభివర్ణించిన బిమల్ గురుంగ్, ఇప్పుడామెను పొగడ్తలతో ముంచెత్తడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. గూర్ఖాలాండ్ కోసం తమ పోరాటం కొనసాగుతుందని, ఈ సమస్యకు రాజకీయ పరిష్కారాన్ని సాధించగలమన్న నమ్మకం ఉందని గూర్ఖా జన్ముక్తి మోర్చా చీఫ్ గా ఉన్న ఆయన వ్యాఖ్యానించారు. 2017 సెప్టెంబర్ లో బిమాల్ అనుచరులుగా భావిస్తున్న కొందరు, ఓ పోలీసు అధికారిని హత్య చేసిన తరువాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి పోలీసులు బిమాల్ కోసం గాలిస్తున్నారు. ఆయనపై ఉగ్రవాద చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదై ఉన్నాయి.
Bimal Gurung
Gurkha Land
Kolkata

More Telugu News