Flood Alert: ప్రకాశం బ్యారేజికి 9 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం... అప్రమత్తమైన అధికారులు

Huge flood alert for Prakasam Barrage at Vijayawada
  • పోటెత్తుతున్న కృష్ణా నది
  • ప్రకాశం బ్యారేజి వద్ద 70 గేట్లు ఎత్తివేత
  • లోతట్టు ప్రాంతాల ప్రజల తరలింపు

తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నది వరద రూపు దాల్చింది. విజయవాడ వద్ద ప్రకాశం బ్యారేజికి భారీగా వరద నీరు పోటెత్తుతోంది. దాంతో 70 గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భారీగా వరద నీరు దిగువకు వస్తుందన్న అంచనాల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా లంక గ్రామాలు, ఇతర లోతట్టు గ్రామాల ప్రజలను ఖాళీ చేయించారు.

ప్రకాశం బ్యారేజి వద్ద ప్రస్తుతం ఇన్ ఫ్లో 7.65 లక్షల క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 7.71 లక్షలుగా ఉంది. ఈ నేపథ్యంలో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కాగా, తెలంగాణలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నందున కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. ఏ క్షణాన్నైనా 9 లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రకాశం బ్యారేజి చేరొచ్చన్న అంచనాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. కృష్ణా నదిపై ఉన్న చివరి బ్యారేజి ప్రకాశం బ్యారేజి కావడంతో పరీవాహక ప్రాంతాల్లోని వరదనీరంతా ఇక్కడికే రావాల్సి ఉంటుంది.

  • Loading...

More Telugu News