Subhash Reddy: ముంపు బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన ఉప్పల్ ఎమ్మెల్యే... విరుచుకుపడిన మహిళలు

Uppal MLA Subhash Reddy faces anger of Ramanthapur women
షార్ట్స్‌లో చూడండి
హైదరాబాద్ నగరంలో వరుణుడి బీభత్సం అంతాఇంతా కాదు. దాదాపు నగరంలో అత్యధిక భాగం జలమయమైంది. ఏకధాటిగా కురిసిన వర్షంతో ప్రధాన రహదార్లు, కాలనీలు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి తన నియోజకవర్గం పరిధిలో పరిస్థితిని సమీక్షించేందుకు ఓ బోటులో వెళ్లగా, రామాంతపూర్ కు చెందిన మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మూడ్రోజుల నుంచి తమకు తిండి, నీళ్లు లేవని మండిపడ్డారు. దాంతో ఎమ్మెల్యే స్పందిస్తూ, మొదట తాను చెప్పేది వినిపించుకోవాలన్నారు. దాంతో ఓ మహిళ... మీరు చెప్పేది మాకు అవసరం లేదు అంటూ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు అలాగే మాట్లాడుతుంటే నేనేమీ చెప్పను అని ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి కొంచెం అసహనం ప్రదర్శించగా, ఎందుకు చెప్పరు? అంటూ ఆ మహిళే రెట్టించిన స్వరంతో ప్రశ్నించింది. చెప్పేది వినకుంటే నేనేం చేయను? అంటూ ఎమ్మెల్యే అనడంతో ఆ మహిళ కాస్త శాంతించింది.

అనంతరం సుభాష్ రెడ్డి మాట్లాడుతూ, ఈ వర్షం అకస్మాత్తుగా వచ్చిందని, దీనికి ఎవరూ ఏమీ చేయలేరని అన్నారు. ఈ విపత్కర పరిస్థితి తన ఒక్కడి ఇంటికి మాత్రమే వచ్చింది కాదని, నగరం మొత్తం బాధపడుతోందని తెలిపారు. హఠాత్తుగా వచ్చిన ఈ వర్షానికి ఎవరూ బాధ్యత వహించరని పేర్కొన్నారు. పరిస్థితి పట్ల ఆ స్థానిక మహిళకు నచ్చచెప్పేందుకు ఆయన విఫలయత్నాలు చేశారు.

అయినా ఆ మహిళ ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడంతో ఎమ్మెల్యే బోటును ముందుకు పోనివ్వాలంటూ సిబ్బందికి పురమాయించారు. దాంతో ఆ మహిళ మరింత కోపంగా... మీరు ఎన్నికలప్పుడు కూడా ఇలాగే వచ్చి వెంటనే వెళ్లిపోతారా? అని నిలదీసింది.
Go Back to Shorts
Subhash Reddy
MLA
Women
Ramanthapur
Rains
Hyderabad

More Telugu News