హైకోర్టుకు బయలుదేరిన హత్రాస్ బాధిత కుటుంబం.. భారీ బందోబస్తు!

  • కలెక్టర్, ఎస్పీ సమక్షంలో కోర్టుకు బయలుదేరిన కుటుంబం
  • ఈ కేసును సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టిన హైకోర్టు
  • బాధిత కుటుంబం వెంట సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ హత్యాచార బాధితురాలి కుటుంబ సభ్యులు నేడు లక్నోలోని అలహాబాద్ హైకోర్టు బెంచ్ కు బయలుదేరారు. జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్పీ వినీత్ జైశ్వాల్ సమక్షంలో భారీ భద్రత మధ్య వారు కోర్టుకు పయనమయ్యారు. అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ ఈ కేసును సుమోటాగా స్వీకరించి విచారణ చేపట్టిన నేపథ్యంలో బాధిత యువతి తల్లిదండ్రులను పోలీసులు కోర్టుకు తరలించారు.

బాధిత కుటుంబం వెంట సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ అంజలి గంగ్వార్ కూడా ఉన్నారు. కాగా, 19 ఏళ్ల దళిత యువతిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడి అనంతరం ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా ఉండేందుకు ఆమె నాలుకను తెగ్గోసినట్టు ఆరోపణలు వచ్చాయి. బాధితురాలు చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందింది. అయితే, ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించకుండా పోలీసులే అర్ధరాత్రి వేళ దహనం చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.


More Telugu News

allahabad high court Hathras Gang rape