పాట ఉన్నంత కాలం శ్రీ ఎస్పీబీ మన హృదయాల్లో సదా నిలిచే ఉంటారు: విజయశాంతి

  • బాలు లేరనే వార్త జీర్ణించుకోలేకపోతున్నా
  • ఆయన ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి
  • ఎంతో ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపారు
ప్రముఖ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల సినీనటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశాడు. ఎస్పీ బాలు ఇక లేరనే వార్త జీర్ణించుకోలేనిదని ఆమె అన్నారు. 'కోట్లాదిమందికి గానామృతాన్ని పంచిన శ్రీ ఎస్పీబీ త్వరగా కోలుకుని మళ్ళీ తన గానంతో అలరిస్తారని ఆశగా ఎదురు చూస్తున్న సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారన్న వార్త తీవ్రంగా కలచివేసింది. గాయకుడిగా, సంగీత దర్శకునిగా నటునిగా బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఎస్పీబీ ఎంత ఎత్తుకు ఎదిగినా చివరి క్షణం వరకూ వినయ విధేయతలతో ఒదిగే ఉంటూ ఎంతో ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపారు.

తన అపార అనుభవాన్ని ఎందరో బాలబాలికలు, యువతీయువకులకు పంచి మన సంగీత వారసత్వం భావితరాలకు అందాలని తపనపడ్డారు. పాట ఉన్నంత కాలం శ్రీ ఎస్పీబీ మన హృదయాల్లో సదా నిలిచే ఉంటారు. శ్రీ బాలుగారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను' అని ట్వీట్ చేశారు.

Vijayashanti
SP Balasubrahmanyam
Tollywood
Congress

More Telugu News