Venkaiah Naidu: అందుబాటులో ఉండే వస్తువులతో వైరస్ పై పోరాడే అద్భుతశక్తిని ఆయుర్వేదం అందిస్తుంది: వెంకయ్యనాయుడు

Venkaiah Naidu explains the importance of Ayurveda
  • సీఐఐ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఆయుర్వేద సదస్సు
  • ఆన్ లైన్ లో ప్రారంభించించిన ఉపరాష్ట్రపతి
  • ఆయుర్వేద ప్రాధాన్యతపై వివరణాత్మక ప్రసంగం
వ్యాధి నిరోధకతకు ఆయుర్వేదం అనే అంశంపై సీఐఐ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఆయుర్వేద సదస్సు జరిగింది. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ సదస్సును ఆన్ లైన్ లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మనందరికీ అందుబాటులో ఉండే వస్తువులతోనే వైరస్ పై పోరాడే అద్భుతమైన శక్తిని ఆయుర్వేదం అందిస్తుందని తెలిపారు. ఆధునిక వైద్య విధానాలకు, ఆయుర్వేదం వంటి సంప్రదాయ వైద్యరీతులను సమ్మిళితం చేసి ప్రపంచ మానవ సంక్షేమం కోసం విస్తృతస్థాయిలో ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

మానవుడు కూడా ప్రకృతిలో ఓ భాగమని ఆయుర్వేదం భావిస్తుందని, అందుకే మానవ దేహానికి వచ్చే సమస్యలను సహజసిద్ధంగా ప్రకృతిలో దొరికే వస్తువులతోనే నయం చేస్తుందని, ఆయుర్వేదం అంటే అదేనని వివరించారు. త్రిదోషాలుగా పేర్కొనే కఫ, పిత్త, వాతాలను, ప్రకృతితో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళితే మానవ దేహం ఎప్పటికీ ఆరోగ్యంగానే ఉంటుందని తెలిపారు.

వేదకాలం నుంచే భారతదేశంలో వివిధ వ్యాధులకు శాస్త్రీయమైన రీతిలో, హేతుబద్ధంగా చికిత్సను అందించారని పేర్కొన్నారు. ఆయుర్వేదం ప్రాధాన్యతను గుర్తించి ప్రభుత్వం, ప్రైవేటు కంపెనీలు సంయుక్తంగా పనిచేస్తూ కొత్త ఔషధాల కోసం ప్రయోగాలు జరపాలని, ఆధునిక పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయడంపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. తద్వారా మనదేశంతో పాటు ప్రపంచదేశాలకు కూడా ఆయుర్వేద ఔషధాలను అందించాలని సూచించారు.
Venkaiah Naidu
Ayurveda
Immunity
Virus
India

More Telugu News