అంతర్వేదిలో వీహెచ్ పీ, భజరంగ్ దళ్ ఆగ్రహాన్ని రుచిచూసిన ఏపీ మంత్రులు

  • అంతర్వేదిలో ఉద్రిక్తత
  • మంత్రులను నిలదీసిన హిందూ సంఘాలు
  • పోలీసులకు, హిందూ సంఘాల కార్యకర్తలకు తోపులాట
అంతర్వేదిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం పూర్తిగా దగ్ధమైన ఘటన హిందూ సంఘాల్లో తీవ్ర ఆగ్రహజ్వాలలు రేకెత్తించింది. అంతర్వేదిలో పర్యటించిన ఏపీ మంత్రులకు ప్రముఖ హిందూ సంఘాలు వీహెచ్ పీ, భజరంగ్ దళ్ తమ ఆగ్రహాన్ని రుచిచూపాయి. అంతర్వేది వచ్చిన మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, పినిపె విశ్వరూప్ తదితరులను వీహెచ్ పీ, భజరంగ్ దళ్ నిలదీశాయి. దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

హిందూ సంఘాల కార్యకర్తలను నిలువరించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా పోలీసులకు, వీహెచ్ పీ, భజరంగ్ దళ్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. అక్కడ ఏర్పాటు చేసిన బారికేడ్లను కూడా తోసుకుని హిందూ సంఘాల కార్యకర్తలు ముందుకు దూసుకువచ్చారు.

ఈ సందర్భంగా ఏపీ మంత్రులు ఈ నెల 15 లోపు పకడ్బందీ విచారణ జరిపి దోషులను పట్టుకుంటామని హామీ ఇచ్చే ప్రయత్నం చేశారు. దీనికి హిందూ సంఘాలు బదులిస్తూ, ఈ నెల 15 లోపు బాధ్యులను పట్టుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాయి. రథం అగ్నికి ఆహుతి కావడం వెనుక కుట్ర ఉందని వీహెచ్ పీ, భజరంగ్ దళ్ ఆరోపిస్తున్నాయి.

VHP
Bhajrangdal
Antarvedi
Vellampalli Srinivasa Rao
Pinipe Viswarup
Chariot
Burning

More Telugu News