రాజోలులోని మూడు వైసీపీ గ్రూపుల్లో నాది కూడా ఒక గ్రూపు: జనసేన ఎమ్మెల్యే రాపాక సంచలన వ్యాఖ్యలు

జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కూడా వైసీపీ నాయకుడినేనని స్పష్టం చేశారు. రాజోలు నియోజకవర్గంలోని మూడు వైసీపీ గ్రూపుల్లో తనది కూడా ఒకటని చెప్పారు. పోటీ ఉండాలనే కారణంతోనే తాను జనసేనలోకి వెళ్లానని అన్నారు.

జనసేన గాలికి వచ్చిన పార్టీ అని... భవిష్యత్తులో ఆ పార్టీ ఉనికే ఉండదని చెప్పారు. అది కేవలం ఒక వర్గానికి చెందిన పార్టీ అని అన్నారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ కు రాపాక ఒక సూచన చేశారు. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పార్టీకి మంచిది కాదని.. గ్రూపులను అంతం చేయడానికి జగన్ ఒక బలమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. వీలైనంత త్వరగా వీటికి ముగింపు పలకాలని అన్నారు.

జనసేన తరపున గెలిచినప్పటికీ రాపాక ఏనాడూ ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరించని సంగతి తెలిసిందే. అసెంబ్లీ సాక్షిగా ఆయన జగన్ ను పొగుడుతూనే ఉన్నారు. పార్టీ హెచ్చరికలను సైతం పట్టించుకోకుండా వైసీపీకి మద్దతు పలికారు. దీంతో, రాపాకను పవన్ పట్టించుకోవడం మానేశారు. తాజాగా రాపాక చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.


More Telugu News