గవర్నర్, జగన్, బీజేపీ ఏపీని నాశనం చేస్తున్నారు.. గవర్నర్ రాజీనామా చేయాలి: సీపీఐ నారాయణ
- మూడు రాజధానులపై ప్రజల ఆమోదాన్ని జగన్ పొందాలి
- గవర్నర్ వైఖరి సరిగా లేదు
- అమరావతికి అనుకూలంగా ఉన్నారనే కన్నాను తొలగించారు
గవర్నర్ ఉత్సవ విగ్రహంలా మారిపోయారని విమర్శించారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ విషయంలో కూడా గవర్నర్ వైఖరి సరిగా లేదని దుయ్యబట్టారు. గవర్నర్ కు రాజకీయ విజ్ఞత ఉంటే వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ ఇలా వ్యవహరించడం దారుణమని అన్నారు. అమరావతికి మద్దతుగా నేడు నారాయణ ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మేరకు విమర్శలు గుప్పించారు.
జగన్, బీజేపీ, గవర్నర్ అందరూ కలిసి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని నారాయణ మండిపడ్డారు. అమరావతి విషయంలో బీజేపీ కూడా ముద్దాయిగా నిలిచిందని చెప్పారు. అమరావతికి కన్నా లక్ష్మీనారాయణ అనుకూలమని... అందుకే ఆయనను పదవి నుంచి తొలగించారని చెప్పారు. న్యాయస్థానాల్లో అమరావతి గెలుస్తుందని అన్నారు. ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేలా జగన్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను మోసం చేసిన ముఖ్యమంత్రిగా జగన్ నిలిచిపోతారని అన్నారు. జగన్ తక్షణమే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు.