ఏపీ సర్కారుపై దేవినేని ఉమ విమర్శనాస్త్రాలు

  • తాడేపల్లి రాజప్రాసాదానికి ఈ మాటలు వినబడుతున్నాయా?
  • కాళ్లా వేళ్లా పడినా వైద్యం అందని దుస్థితి ప్రభుత్వానికి కనబడుతుందా?
  • ఇప్పటివరకు ఎంత ఖర్చు పెట్టారో చెప్పండి? అంటూ నిలదీత
ఏపీ ఎన్నికల కమిషనర్‌ పదవి నుంచి నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ను తొలగిస్తూ‌ వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. అయితే, దీనిపై ఏపీ ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆయనను నియమించాలంటూ ఏపీ ప్రభుత్వానికి గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌ కూడా ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు, వైసీపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో కూడా ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిందేనని చెప్పడంతో ఈ అంశాలపై టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు స్పందిస్తూ ఏపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు.

'కోర్టు తీర్పులను ఎందుకు అమలుచేయటం లేదు? ఏపీ ప్రభుత్వానికి ఏమైంది? గవర్నర్ జోక్యం చేసుకోవాలా.. ఇదేం తీరు? కేసుపై మాకు అవగాహన ఉంది?  ఏపీలో అసలేం జరుగుతోంది? ఎవరు చెప్పినా వినం మా పాలన మా ఇష్టమంటున్న తాడేపల్లి రాజప్రసాదానికి ఈ మాటలు వినబడుతున్నాయా? ముఖ్యమంత్రి జగన్ గారు' అని దేవినేని ఉమ విమర్శించారు.

కాగా, ఆంధప్రదేశ్‌లో కొవిడ్‌-19 వైరస్‌ విజృంభణ రికార్డు స్థాయిలో పెరిగిపోతుండడం పట్ల దేవినేని ఉమ విమర్శలు గుప్పించారు. 'జోరు తగ్గని కరోనా.. 8,147కేసులు, 49 మరణాలు నమోదు. ఊపిరి పోస్తారని వస్తే ఉసురే పోయింది. లక్షణం ఉంటే వైద్యం అందదంతే. కాళ్లా వేళ్లా పడినా వైద్యం అందని దుస్థితి ప్రభుత్వానికి కనబడుతుందా? జగన్‌ గారు ఆరు నెలలకు వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం కాదు ఇప్పటివరకు ఎంత ఖర్చు పెట్టారో చెప్పండి' అని ప్రశ్నించారు.


More Telugu News

Devineni Uma Telugudesam Andhra Pradesh YSRCP