వికాశ్ దూబే సన్నిహితుడి రేషన్ షాపులో 7 నాటు బాంబులు.. కొనసాగుతున్న పోలీసుల వేట.. మరో ఇద్దరి అరెస్ట్!

  • దూబే సన్నిహితుడు దయాశంకర్ షాపు నుంచి స్వాధీనం
  • గ్వాలియర్‌లో మరో ఇద్దరి అరెస్ట్
  • దూబే ఎన్‌కౌంటర్‌తో బ్రిక్రు గ్రామస్థుల సంబరాలు
ఉత్తరప్రదేశ్ గ్యాంగ్‌స్టర్ వికాశ్ దూబే హతమైన తర్వాత అతడి అనుచరుల పనిపట్టేందుకు పోలీసులు నడుంబిగించారు. ఇందులో భాగంగా గాలింపు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో అతడి అనుచరుడైన బ్రిక్రు గ్రామానికి చెందిన దయాశంకర్ అగ్నిహోత్రికి చెందిన రేషన్ షాపు నుంచి నిన్న ఏడు నాటు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరోవైపు, పోలీసులను హతమార్చిన కేసులో నిందితులైన దూబే ముఠాకు చెందిన ఇద్దరు సభ్యులను మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో యూపీ పోలీసులు ఈ ఉదయం అరెస్ట్ చేశారు. దూబే ముఠా సభ్యులైన ఓం ప్రకాశ్ పాండే, అనిల్ పాండేలు గ్వాలియర్‌లోని రహస్య స్థావరంలో దాక్కున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వీరిద్దరూ మరో రహస్య స్థావరానికి మకాం మార్చేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు దాడిచేసి పట్టుకున్నట్టు కాన్పూర్ జోన్ అదనపు డైరెక్టర్ జనరల్ జేఎన్ సింగ్ తెలిపారు.  

కాగా, పోలీసుల ఎన్‌కౌంటర్‌లో దూబే హతమైన వార్త తెలియడంతో అతడి స్వగ్రామమైన బ్రిక్రూ గ్రామస్థులు సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచుకుని హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. అతడి మరణంతో తమ గ్రామానికి పట్టిన పీడ విరగడైందని, తమకు స్వేచ్ఛ లభించిందని వీధుల్లోకి వచ్చి డ్యాన్సులు చేశారు.

Gangster Vikas Dubey
Kanpur
Bikru
Uttar Pradesh

More Telugu News