అచ్చెన్నాయుడిని మూడు రోజుల కస్టడీకి అనుమతించిన కోర్టు

ఈఎస్ఐ స్కాం కేసులో రిమాండ్ లో ఉన్న టీడీపీ నేత అచ్చెన్నాయుడిని కస్టడీలోకి తీసుకోవడానికి ఏసీబీ స్పెషల్ కోర్టు అనుమతించింది. మూడు రోజుల కస్టడీకి అనుమతి మంజూరు చేసింది. అచ్చెన్న ఆరోగ్యం బాగోలేదని న్యాయవాది తెలపడంతో... ఆసుపత్రిలోనే లాయర్ల సమక్షంలో ఆయనను విచారించాలని కోర్టు పేర్కొంది. ఆయనతో పాటు ఇన్స్యూరెన్స్ మెడికల్ సర్వీసెస్ మాజీ డైరెక్టర్ రమేశ్ కుమార్ ను కూడా కస్టడీకి అప్పగించింది.

శ్రీకాకుళం జిల్లాలోని నివాసం నుంచి అచ్చెన్నను  అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు ఆయనను విజయవాడలోని కార్యాలయానికి తరలించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయనను ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా... కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలోనే ఉన్నారు.


More Telugu News