చెయ్యి చాస్తే తీర్థం... రూ. 2,700 ఖర్చుతో తయారు చేసిన బీటెక్ విద్యార్థులు!

  • స్వామి దర్శనం అనంతరం కాంటాక్ట్ లెస్ తీర్థం
  • ఉడుపి జిల్లా నిట్టె మహాలింగ కళాశాల విద్యార్థుల తయారీ
  • అన్ని ఆలయాల్లో ప్రవేశపెట్టాలన్న అర్చకుల సంఘం
దేవాలయానికి వెళితే, స్వామి దర్శనం అనంతరం భక్తులు చూసేది తీర్థ, ప్రసాదాల కోసమే. తీర్థం తీసుకున్న తరువాతే స్వామి అనుగ్రహం తమపై పడుతుందన్న నమ్మకం భక్తుల్లో ఉంటుంది. కరోనా మహమ్మారి కారణంగా, ఆలయాల్లో తీర్థం ఇవ్వడంపై నిషేధం అమలులో ఉండగా, కర్ణాటకలోని బీటెక్ విద్యార్థులు, కేవలం రూ. 2,700 ఖర్చుతో, చెయ్యి చాచగానే తీర్థం ఇచ్చే మెషీన్ ను తయారు చేశారు. ఉడుపి జిల్లా నిట్టె మహాలింగ్ ఇంజనీరింగ్ విద్యార్థులు, కాంటాక్ట్ లెస్ మెషీన్ గా దీన్ని తీర్చిదిద్దారు. దీని పేరు 'మిషన్ అర్చక'.

కాలేజీ ఆవరణలోనే ఉన్న మహా గణపతి ఆలయంలో దీన్ని అమర్చారు. తీర్థాన్ని ఓ క్యాన్ లో ఉంచి, దానికి చిన్న పైపును అమర్చి, ఓ సెన్సార్ ను ఏర్పాటు చేశారు. భక్తులు దాని వద్దకు వచ్చి చెయ్యి చాచగానే, 5 నుంచి 10 ఎంఎల్ తీర్థం పడుతుంది. ఇన్ ఫ్రారెడ్ సెన్సార్ టెక్నాలజీ ఆధారంగా ఇది పనిచేస్తుందని విద్యార్థులు తెలిపారు. దీన్ని అన్ని ఆలయాల్లో వినియోగించేందుకు అనుమతించాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిని కోరనున్నామని రాష్ట్ర అర్చకుల సంఘం ప్రెసిడెంట్ జానకీ రామ్ వెల్లడించారు.

Contactless Tertham
Karnataka
Techchies
Automatic

More Telugu News