Quarantine Centre: క్వారంటైన్‌లోకి వెళ్లేందుకు అధికారులను ముప్పుతిప్పలు పెట్టిన ‘రౌడీ బేబీ’!

  • రౌడీబేబీగా చిరపరిచితురాలైన సుబ్బులక్ష్మి
  • మూడున్నర నెలల తర్వాత సింగపూర్ నుంచి తమిళనాడుకు
  • డిమాండ్లు నెరవేరుస్తామన్న తర్వాతే క్వారంటైన్‌కు..
TikTok celebrity Rowdy Baby sent to quarantine center

టిక్‌టాక్ ద్వారా ‘రౌడీ బేబీ’గా చిరపరిచితమైన తమిళనాడుకు చెందిన సూర్య అలియాస్ సుబ్బులక్ష్మి క్వారంటైన్‌లోకి వెళ్లేందుకు అధికారులను ముప్పుతిప్పలు పెట్టింది. టిక్‌టాక్‌లో ఆమె ప్రదర్శనకు ముగ్ధులైన కొందరు ఆమెను ఇటీవల సింగపూర్‌కు ఆహ్వానించారు.

అయితే, లాక్‌డౌన్ కారణంగా మూడున్నర నెలలపాటు అక్కడే చిక్కుకుపోయిన ఆమె ఇటీవల తిరిగి తమిళనాడు చేరుకుంది. విమానంలో కోయంబత్తూరు చేరుకున్న ఆమెను నిబంధనల ప్రకారం 14 రోజులు క్వారంటైన్‌కు తరలించాలని నిర్ణయించారు. అయితే, విమానాశ్రయంలో అధికారుల కళ్లు గప్పిన ఈ ‘రౌడీ బేబీ’ తిరుప్పూర్ అయ్యం పాళయంలోని ఇంటికి చేరుకుంది. ఇక అక్కడి నుంచి అధికారులకు కష్టాలు మొదలయ్యాయి.

ఆమె ఉంటున్నది అద్దె ఇల్లు కావడం, కామన్ బాత్రూం ఉండడంతో ఇరుగుపొరుగు వారిలో ఆందోళన మొదలైంది. వారి ఫిర్యాదు మేరకు ఆమె ఇంటికి చేరుకున్న వైద్యాధికారులను సుబ్బులక్ష్మి బెదిరించింది. తాను క్వారంటైన్‌కు వెళ్లేది లేదని తెగేసి చెప్పింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆమెను క్వారంటైన్‌కు పంపేందుకు పడరాని పాట్లు పడ్డారు. ఆమె అందాన్ని పొగుడుతూ ఆమెను మెప్పించడంతో ఎట్టకేలకు మెట్టుదిగిన సుబ్బులక్ష్మి అంగీకరించింది. అయితే, క్వారంటైన్‌లో తనకు ప్రత్యేక గది ఉండాలని, టిక్‌టాక్‌కు అనుమతి ఇవ్వాలని, తనకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించాలని ఆమె చేసిన డిమాండ్‌కు పోలీసులు, వైద్యాధికారులు అంగీకరించడం గమనార్హం.

  • Loading...

More Telugu News