పదో తరగతి పిల్లలపై మీరెందుకు ఇలా ఆలోచిస్తున్నారు?: సీఎం జగన్ ను తప్పుబట్టిన చంద్రబాబు

  • పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్
  • విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని వెల్లడి
  • సీఎం జగన్ సహా ఎవరూ మాస్కులు ధరించకపోవడాన్ని ఆక్షేపించిన చంద్రబాబు
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జగన్ పైనా, అధికార వైసీపీపైనా ధ్వజమెత్తారు. సమావేశాల సందర్భంగా సీఎం జగన్ సహా అధికార పక్ష సభ్యులు మాస్కులు పెట్టుకోకపోవడాన్ని ఆయన ఎత్తిచూపారు. కరోనా నియంత్రణపై ఏమాత్రం శ్రద్ధలేదని ఆరోపించారు. కరోనా వ్యాప్తిని కట్టడి చేయాలన్న ఆలోచన లేకుండా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. మనల్ని మనం కాపాడుకోవడం అంటే సమాజాన్ని కాపాడినవాళ్లం అవుతామని హితవు పలికారు. ఎవరికి కరోనా ఉందో తెలియని పరిస్థితుల్లో విచ్చలవిడిగా తిరిగితే అనర్థమేనని హెచ్చరించారు.

ఇక, పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం పట్టుదలగా ఉండడం పట్ల చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. అటు తమిళనాడు, ఇటు తెలంగాణ కూడా పది పరీక్షలు రద్దు చేశాయని, మీకెందుకు భేషజం అంటూ ప్రశ్నించారు. పిల్లలపై మీరెందుకు ఇలా ఆలోచిస్తున్నారంటూ సీఎం జగన్ సర్కారును నిలదీశారు. బయటికి రావాలంటేనే భయపడే పరిస్థితుల్లో తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారని, రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

Chandrababu
YSRCP
Jagan
Tenth Class
Exams
Andhra Pradesh

More Telugu News