ముంబయిలో నిండుకున్న ఐసీయూలు... కొత్త కేసులొస్తే చేతెలెత్తేయడమే!
- దేశ ఆర్థిక రాజధానిలో కరోనా విజృంభణ
- ఇండియాలోని మొత్తం కేసుల్లో 30 శాతం మహారాష్ట్రలోనే
- కొత్త కేసులకు బెడ్లు, వెంటిలేటర్లు లేవంటున్న వైద్యులు
ముంబయిలో 99 శాతం ఐసీయూ బెడ్లు, 94 శాతం వెంటిలేటర్లను కరోనా రోగుల చికిత్స నిమిత్తం వాడుతున్నామని ముంబయి మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) స్వయంగా పేర్కొంది. ఈ నెల 11 నాటికి నగరంలోని మొత్తం 1,181 ఐసీయూ పడకల్లో 1, 167 పడకలను కరోనా తీవ్రమైన వారి కోసం వినియోగిస్తున్నామని, మిగిలిన 14 పడకలూ శనివారం రాత్రికే నిండిపోవచ్చని అధికారులు వెల్లడించారు.
ఇక వెంటిలేటర్ల విషయానికి వస్తే, అందుబాటులో ఉన్న 530 వెంటిలేటర్లలలో 497 రోగులకు అమర్చామని, 5,260 ఆక్సిజన్ పడకలలో 3,986 (76 శాతం) వాడుకలో ఉన్నాయని అధికారులు వెల్లడించారు. కరోనా సోకిన సాధారణ రోగుల కోసం 10,450 పడకలు అందుబాటులో ఉండగా, 9,098 పడకలు (87 శాతం) నిండిపోయాయని అధికారులు వెల్లడించారు. బెడ్లు, వెంటిలేటర్ల సంఖ్యను పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.