87 ఏళ్ల వయసులో రాజ్యసభలో రెండో సారి అడుగుపెట్టనున్న దేవేగౌడ

  • రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన దేవేగౌడ
  • మల్లికార్జున ఖర్గే, మరో ఇద్దరు బీజేపీ నేతలు కూడా
  • కర్ణాటకలో నాలుగు స్థానాలూ ఏకగ్రీవం
మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవేగౌడ మరోసారి పార్లమెంటులో అడుగుపెట్టనున్నారు. రాజ్యసభకు ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే, బీజేపీ అభ్యర్థులు అశోక్ గస్తి, ఇరానా కడడి కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో కర్ణాటకలో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎలాంటి పోటీ లేకుండా ఎన్నికల ప్రక్రియ ముగిసినట్టైంది. తమ సంఖ్యాబలాలకు తగినట్టుగానే పార్టీలు అభ్యర్థులను బరిలోకి దింపడంతో... నాలుగు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.

కర్ణాటక అసెంబ్లీలో స్పీకర్ తో కలిపి బీజేపీకి 117 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ కు 68, జేడీఎస్ కు 34 మంది ఉన్నారు. ఒక రాజ్యసభ సీటును గెలవాలంటే 45 మంది సంఖ్యాబలం అవసరం. ఇంత బలం జేడీఎస్ కు లేనప్పటికీ... కాంగ్రెస్ మద్దతుతో దేవేగౌడ గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ ఒక సభ్యుడిని గెలుచుకుని... మిగిలిన సభ్యుల ఓట్లతో దేవేగౌడకు మద్దతుగా నిలిచింది.

87 ఏళ్ల దేవేగౌడ రాజ్యసభకు రెండో సారి వెళ్తున్నారు. మొదటిసారి ప్రధానిగా ఆయన రాజ్యసభకు వెళ్లారు. మల్లిఖార్జున ఖర్గే తొలిసారి రాజ్యసభకు వెళ్తున్నారు.

Deve Gowda
Mallikharjuna Kharge
Rajya Sabha

More Telugu News