సి.కల్యాణ్ పై నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా: 'మా' అధ్యక్షుడు నరేశ్

నందమూరి బాలకృష్ణను సమావేశాలకు ఆహ్వానించాల్సిన బాధ్యత 'మా' కార్యవర్గంపైనే ఉందని నిర్మాత సి. కల్యాణ్ పేర్కొనడం తనకు దిగ్భ్రాంతి కలిగించినట్టు మా అధ్యక్షుడు నరేశ్ ఇంతకుముందు తెలిపారు. అయితే ఇప్పుడాయన మనసు మార్చుకున్నారు. సి.కల్యాణ్ పై తన ప్రకటనను ఉపసంహరించుకుంటున్నట్టు తెలిపారు. అందుకు కారణం, సి.కల్యాణ్ తనకు ఫోన్ చేసి వివరణ ఇవ్వడమేనని నరేశ్ వెల్లడించారు.

'మా'కు సమాచారం ఇవ్వకపోవడం ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని, సమాచార ప్రసార లోపంతోనే ఈ పొరబాటు జరిగి ఉంటుందని కల్యాణ్ తనతో చెప్పారని నరేశ్ వివరించారు. అందుకే కల్యాణ్ పై ఇంతక్రితం చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియా నుంచి తొలగిస్తున్నానని చెప్పారు. టాలీవుడ్ లో శాంతియుత, స్నేహపూర్వక వాతావరణాన్ని కోరుకుంటున్నానని, దానికోసమే పాటుపడతానని నరేశ్ ఉద్ఘాటించారు.


More Telugu News