చారిత్రాత్మక మూడు లాంతర్ల స్తంభాన్ని ధ్వంసం చేయడం బాధాకరం: అశోక్ గజపతి రాజు

  • విజయనగరంలో ప్రసిద్ధికెక్కిన మూడు లాంతర్ల స్తంభం
  • 1860లో ఏర్పాటైనట్టు చారిత్రక ఆధారాలు
  • స్తంభం కూల్చివేత దారుణం అంటూ అశోక్ గజపతిరాజు వ్యాఖ్యలు
విజయనగరం పట్టణంలోని మూడు లాంతర్ల స్తంభాన్ని కూల్చివేయడం బాధాకరమని టీడీపీ మాజీ ఎంపీ అశోక్ గజపతిరాజు వ్యాఖ్యానించారు. ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన ఆ కట్టడం కూల్చివేత పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఎంతో ఘన చరిత్ర ఉన్న స్థూపాన్ని కూల్చడం ద్వారా జాతీయ చిహ్నాన్ని సైతం అధికారులు అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ చర్యలను అందరూ ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. పరిస్థితి చూస్తుంటే భవిష్యత్తులో ఇంకా చాలా చారిత్రక కట్టడాలు కూల్చే ప్రమాదం ఉందని ఆందోళన వెలిబుచ్చారు. దీనిపై విజయనగరం పౌరులతో కలిసి శాంతియుత పద్ధతిలో నిరసన తెలుపుతామని అన్నారు.

విజయనగరంలోని శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం సమీపంలో ఉన్న మూడు లాంతర్ల స్తంభం 1860 ప్రాంతంలో ఏర్పాటైనట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఇప్పుడీ స్థూపం స్థానంలో కొత్తది నిర్మించాలని అధికారులు ప్రయత్నిస్తుండడం స్థానికంగా ఎంతో అసంతృప్తి కలిగిస్తోంది.

Ashok Gajapathi Raju
Three Lanterns Tower
Vijayanagaram
Historical
Andhra Pradesh

More Telugu News