Etela Rajender: తెలంగాణలో ‘కరోనా’ పాజిటివ్ కేసుల సంఖ్య 983: మంత్రి ఈటల రాజేందర్

తెలంగాణలో ‘కరోనా’ పాజిటివ్ కేసుల సంఖ్య 983కు చేరిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. హైదరాబాద్ లో ఇవాళ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో గడచిన ఇరవై నాలుగు గంటల్లో 13 కేసులు నమోదయ్యాయని, యాక్టివ్ కేసుల సంఖ్య 663కు చేరిందని, బాధితుల్లో ఏడుగురు వెంటిలేటర్ పై ఉన్నారని తెలిపారు. ఇప్పటి వరకు డిశ్చార్జి అయిన వారి సంఖ్య 291 అని వివరించిన ఈటల, ఈరోజు ‘కరోనా’ మరణాలు లేవని తెలిపారు.

సూర్యాపేట, గద్వాల, వికారాబాద్, జీహెచ్ఎంసీ ప్రాంతాల నుంచి ఎక్కువ కేసులు నమోదయ్యాయని చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో 44 కుటుంబాల ద్వారా 265 మందికి,  వికారాబాద్ లో 14 కుటుంబాల నుంచి 38 మందికి, సూర్యాపేటలో 25 కుటుంబాల నుంచి 83 మందికి, గద్వాలలో 30 కుటుంబాల నుంచి 45 మందికి కరోనా సోకినట్టు వివరించారు.

గాంధీ ఆస్పత్రికి మరమ్మతులు నిర్వహించి కొవిడ్ ఆసుపత్రికి ఉండాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించామని, సంపూర్ణ కొవిడ్ ఆస్పత్రిగా మార్చామని అన్నారు. ‘కరోనా’ పాజిటివ్ ఉన్నవారికి పౌష్టికాహారం అందిస్తున్నామని చెప్పారు.
Etela Rajender
TRS
Corona Virus

More Telugu News