Swami Swarupanandendra: ప్రపంచానికి కాలసర్ప దోషం... కరోనా కంట్రోల్ కాకపోవడానికి కారణమిదే: స్వామి స్వరూపానందేంద్ర

swaroopanandendra analises corona may go down after May 5
  • మరో 18 రోజులపాటు వైరస్ ప్రభావం
  • ఆపై పూర్తిగా తగ్గనున్న మహమ్మారి
  • ప్రజలు దైవారాధనలో ఉండాలని సూచన
కరోనా మహమ్మారి ప్రభావం మరో 18 రోజులు ఉంటుందని విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యానించారు. మే 5 తరువాత వైరస్ పూర్తిగా తగ్గుముఖం పడుతుందని జోస్యం చెప్పిన ఆయన, ఎన్నో విపత్కర పరిస్థితులను చూసి తట్టుకుని నిలిచిన భారతీయులు, కరోనా గురించి భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. భగవంతుని నామస్మరణతో దేశానికి రక్షణ లభిస్తుందని, ఇళ్లలో లాక్ డౌన్ పాటిస్తున్న వేళ, పిల్లల్లో ఆధ్యాత్మిక చింతన పెంచుతూ, భక్తితో మెలగాలని ఆయన సూచించారు.

ప్రపంచానికి ఇప్పుడు కాలసర్ప దోషం పట్టుకుందని, దాని ప్రభావంతోనే కరోనా నియంత్రణలోకి రావడం లేదని స్వరూపానందేంద్ర విశ్లేషించారు. ఈ నెల 24వ తేదీ నుంచి దుష్ట గ్రహాలు మానవాళిపై చూపించే ప్రభావం తగ్గుముఖం పడుతుందని, మే 5 నాటికి పూర్తిగా తొలగుతుందని ఆయన అన్నారు. ఈ వైరస్ ప్రమాదకరమే అయినా, దేవుడి ఆశీస్సులతో ప్రభావం తగ్గుతుందని తెలిపారు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ వైరస్ ఏళ్ల తరబడి కొనసాగే అవకాశాలు లేవని, ఇండియాకు పెద్దగా నష్టం కూడా జరుగబోదని స్వరూపానందేంద్ర అంచనా వేశారు. కరోనా వ్యాధి నియంత్రణకు విశాఖ శారదాపీఠంలో రాజశ్యామల అమ్మవారి ఉపాసన చేస్తున్నామని వెల్లడించిన ఆయన, వైరస్ ప్రభావాన్ని తగ్గించేందుకు జపాలు, హోమాలు, యజ్ఞ యాగాదులు నిర్వహించామని పేర్కొన్నారు.
Swami Swarupanandendra
Corona Virus
Kala Sarpa Dosham

More Telugu News