Rachakonda police: మణిపూర్ విద్యార్థులను అడ్డుకున్న సూపర్ మార్కెట్ నిర్వాహకులు.. అరెస్ట్ చేసిన పోలీసులకు కేంద్రమంత్రి ప్రశంసలు!

Union minster Kiren Rijiju praises Rachakonda police
  • సూపర్ మార్కెట్లోకి రాకుండా అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బంది
  • చర్యలు తీసుకోవాలంటూ డీజీపీని కోరిన కేటీఆర్
  • దేశ సమైక్యతను చాటారంటూ కేంద్రమంత్రి ప్రశంసలు
తెలంగాణలోని రాచకొండ పోలీసులకు కేంద్రమంత్రి కిరణ్ రిజుజు నుంచి ప్రశంసలు లభించాయి. విదేశీయుల్లా కనిపించడంతో ఇద్దరు మణిపూర్ విద్యార్థులను లోపలికి రాకుండా వనస్థలిపురంలోని స్టార్ సూపర్ మార్కెట్ నిర్వాహకులు అడ్డుకున్నారు. విషయం తెలిసిన మంత్రి కేటీఆర్ నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ ట్విట్టర్ ద్వారా డీజీపీ మహేందర్‌రెడ్డిని కోరారు.

ఆయన ఆదేశాలతో రాచకొండ పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. అనంతరం సీపీ మహేశ్ భగవత్ బాధిత విద్యార్థులను స్వయంగా కలిసి సరుకులు పంపిణీ చేశారు. ఈ విషయాన్ని రాచకొండ పోలీసులు తమ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ ట్వీట్‌కు కేంద్ర  యువజన, క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజుజు స్పందించారు. నిందితులపై చర్యలు తీసుకున్నందుకు అభినందనలు తెలిపారు. పోలీసుల చర్య దేశ సమైక్యతను చాటిందని, సానుకూల దృక్పథాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిందని ప్రశంసించారు.
Rachakonda police
Telangana
Kiren rijiju
KTR

More Telugu News