Corona Virus: కరోనా వైరస్ బారిన పడిన వారెవరి పరిస్థితి విషమంగా లేదు: ఈటల రాజేందర్

- తెలంగాణలో కరోనా వ్యాప్తి లేదు
- కరోనాను కట్టడి చేసేందుకే లాక్ డౌన్
- కరోనా బాధితుల్లో ఇతర సమస్యలు లేవు
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి లేదని... విదేశాల నుంచి వచ్చిన వారి నుంచే ఈ వ్యాధి వచ్చిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. వైరస్ సోకకుండా, విస్తరించకుండా అందరూ తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
వైరస్ సోకిన వారందరికీ ప్రభుత్వం అవసరమైన చికిత్స అందిస్తోందని... వైరస్ సోకిన వారెవరూ విషమ పరిస్థితుల్లో లేరని చెప్పారు. కరోనా విస్తరణను కట్టడి చేసేందుకే ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిందని తెలిపారు. హైదరాబాద్ కోఠిలోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, ప్రైవేట్ కాలేజీల ప్రతినిధులతో ఈరోజు నిర్వహించిన సమీక్షలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కరోనా వైరస్ చికిత్స కోసం ప్రస్తత దశలో ప్రభుత్వ ఆసుపత్రులను వాడుకుంటున్నామని... రెండో దశలో ప్రైవేట్ వైద్య కళాశాలలను కూడా వాడుకుంటామని ఈటల చెప్పారు. కరోనా బాధితుల కోసం ప్రస్తుతం 10 వేల పడకలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. చికిత్స పొందుతున్న కరోనా బాధితుల్లో ఇతర సమస్యలు లేవని చెప్పారు.