ఏపీలో ఇప్పటివరకు 70 మందికి కరోనా పరీక్షలు.. కీలక వివరాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

  • ఒకరికి కరోనా పాజిటివ్‌ 
  • 57 మందికి నెగటివ్‌గా నిర్ధారణ
  • 777 మందికి స్క్రీనింగ్‌
  • అంటువ్యాధుల చట్టం ప్రకారం కరోనా నియంత్రణకు చర్యలు
కరోనా విజృంభణ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఈ వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర సర్కారు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఏపీ కుటుంబ ఆరోగ్యశాఖ సంచాలకుడు ఈ విషయంపై ఓ ప్రకటన విడుదల చేశారు. ఏపీలో ఇప్పటివరకు 70 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని, ఒకరికి కరోనా పాజిటివ్‌ గా తేలిందని చెప్పారు. అలాగే, నెగెటివ్‌గా 57 మందికి నిర్ధారణ అయిందని, శాంపిల్స్‌ ఫలితాలు రావాల్సినవి కేసులు 12 ఉన్నాయని పేర్కొన్నారు.

777 మందికి స్క్రీనింగ్‌ జరిగిందని, వారు పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు. 28 రోజుల పర్యవేక్షణ పూర్తి చేసుకున్న బాధితులు 244 అని, ఆసుపత్రిలో అబ్జర్వేషన్‌లో ఉన్నవారి సంఖ్య 21 అని తెలిపారు. కరోనాపై చర్యలు తీసుకునేందుకు 1897 అంటువ్యాధుల చట్టం ప్రకారం కరోనా నియంత్రణకు జిల్లా కలెక్టర్లు, మెడికల్‌ హెల్త్‌ ఆఫీసర్లుకు అధికారాలు ఇచ్చామన్నారు. జిల్లా కలెక్టర్లను జిల్లా నోడల్‌ ఆఫీసర్లుగా ప్రకటించామన్నారు. 24 గంటలు పనిచేసే కంట్రోల్‌ రూమ్‌ నం.0866 2410978 ఏర్పాటు చేశామని చెప్పారు. అలాగే,  104 హెల్ప్‌ లైన్‌కు ఫోన్‌ చేయొచ్చని చెప్పారు. కరోనా వ్యాప్తి నిరోధం కోసం  ప్రజలు చర్యలు తీసుకోవాలని సూచించారు.



More Telugu News